ఆ ఏడుగురు ఉగ్రవాదులను మీరు చూశారా?

27 Jan, 2016 10:12 IST|Sakshi
ఆ ఏడుగురు ఉగ్రవాదులను మీరు చూశారా?

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో ఉగ్రవాదుల కలకలం రేగింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఏడుగురు అనుమానిత వ్యక్తులు డెహ్రాడూన్లో ఓ వీధిలో వెళుతుంటే సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఉత్తరాఖండ్ పోలీసులు ఆ వీడియోను వాట్సాప్లో విడుదల చేశారు. వారిని ఎక్కడైనా చూసి ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇందులో చూపిన ప్రకారం ముందు ముగ్గురు ఆతర్వాత నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా చుట్టుపక్కల చూస్తూ ముఖాలకు ముసుగు ధరించి, వీపులపై బ్యాగులు తగిలించుకొని సీసీటీవీ కెమెరా ముందు నుంచి కదిలారు.

రిపబ్లిక్ డే సందర్భంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం మేరకు అప్రమత్తమైన పోలీసులు అడుగడుగునా అన్ని రాష్ట్రాల్లో తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయా అనుమానిత చోట్ల సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా ఏడుగురు అనుమానితులు డెహ్రాడూన్లోని ఓ వీధిలో కనిపించారు. దీంతో పోలీసులు రాష్ట్రమంతటా హై అలర్ట్ ప్రకటించారు. వారి కోసం గాలింపులు ప్రారంభించారు. ఇస్లామిక్ స్టేట్ తో సంబంధాలు పెట్టుకున్న నలుగురు వ్యక్తులను సీసీటీవీ ఆధారంగా హరిద్వార్ లోని రూర్కీలో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా సీసీటీవీ ఫుటేజి కూడా సంచలనం రేపుతోంది.

>
మరిన్ని వార్తలు