లక్ష దాటిన పాజిటివ్ కేసులు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా ఈ వైరస్ బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం భారీ ఊరట ఇస్తోంది. మహమ్మారి బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 39,174కి పెరగడంతో కరోనా రోగుల్లో రికవరీ రేటు ఏకంగా 38.73 శాతానికి చేరింది. రికవరీ రేటు మెరుగుదల కొనసాగడం సానుకూల పరిణామమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 24 లక్షల శాంపిళ్లను పరీక్షించామని తెలిపింది.
భారత్లో గడిచిన 24 గంటల్లో 4970 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడటంతో మొత్తం కేసుల సంఖ్య లక్ష దాటింది. పాజిటివ్ కేసుల సంఖ్య మంగళవారం నాటికి 1,01,139కి చేరగా మృతుల సంఖ్య 3163కి ఎగబాకింది. వీటిలో 50 శాతం కేసులు ఐదు మహానగరాల నుంచే నమోదవడం గమనార్హం. ఇక ముంబైలోని ధారవిలో 26 కేసులు బయటపడగా ఆసియాలోనే అతిపెద్ద మురికివాడలో కేసుల సంఖ్య 1353కి పెరిగిందని బీఎంసీ అధికారులు వెల్లడించారు.మరోవైపు దేశ రాజధాని ఢిల్లీని మహమ్మారి వణికిస్తూనే ఉంది. ఢిల్లీలో మంగళవారం 500 తాజా కోవిడ్-19 కేసులు వెలుగుచూడటంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 10,500కు పెరిగింది.