దైవభూమిని ముంచెత్తిన వరదలు

19 Aug, 2019 14:18 IST|Sakshi

కేరళ వ్యాప్తంగా భారీ వరదలు.. విరిగిపడుతున్న కొండచరియలు

121కి చేరిన మృతుల సంఖ్య

తిరువనంతపురం: దైవభూమి కేరళలో వరద బీభత్సం కొనసాగుతోంది. వరదలకు మృతిచెందిన వారి సంఖ్య సోమవారం నాటికి 121కి చేరుకోగా.. గల్లంతయిన వారి సంఖ్య 40కి చేరింది. వరదలకు అత్యధికంగా మలప్పురం జిల్లాలో 50 మంది, కోజికోడ్‌లో 17 మంది, వాయనాడ్‌లో 12 మంది, కన్నూర్, త్రిసూర్‌లో 9 మంది చొప్పున మృత్యువాతపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.13 లక్షల మంది ప్రజలు ఇంకా పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు.

కేరళ వ్యాప్తంగా 805 సహాయక పునరావాస శిబిరాల్లో 41,253 కుటుంబాలకు చెందిన 1,29,517 మంది ఇంకా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. వరదలకు మొత్తం 1,186 ఇల్లు పూర్తిగా నెలమట్టమయ్యాయని, 12,761 నివాసాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. శిధిలాల కింద చిక్కుకున్న వారికోసం రెస్క్యూ టీంలు గాలిస్తున్నారు.  ఇక్కడ జీపీఎస్ సాయంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. 

చదవండి: భయపెడుతున్న బియాస్.. 28కి చేరిన మృతులు

మరోవైపు ఉత్తర భారతంలో కూడా వరదలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ వరదలు సంభవిస్తున్నాయి. బియాస్‌, సట్లేజ్‌ నదుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో ఇప్పటి వరకు 28 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలోని యమున నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అధికారులంతా సహాయ చర్యలను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. 

మరిన్ని వార్తలు