సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర భారతంలో కురుస్తున్న భారీ వర్షాలకు యమున నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వరదలతో 205 మీటర్ల ఎత్తులో నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో దేశ రాజధాని ఢిల్లీకి భారీ వరద ముంపు పొంచి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. యమునా నది వరద ఉధృతి క్రమంగా పెరుగుతుండటం ఢిల్లీ వాసులు ఆందోళనకు గురువతున్నారు. ఢిల్లీలో వరద పరిస్థితిపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమీక్షించారు. వరద మరింత పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను అప్రమత్తం చేశారు.
గత కొద్దిరోజులుగా దక్షిణాదిని వణికిస్తోన్న వరదలు ఇప్పుడు ఉత్తర భారతంపై ప్రతాపాన్ని చూపుతున్న విషయం తెలిసిందే. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. పంజాబ్లో భారీ వర్షాల కారణంగా యమున, సట్లెజ్, బియాస్ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.