హేమమాలినికి తృటిలో తప్పిన ప్రమాదం

14 May, 2018 11:41 IST|Sakshi

మధుర: ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ హేమమాలినికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె కాన్వాయ్‌ వెళ్తుండగా ఒక్కసారిగా చెట్టు కూలి రోడ్డుపై పడిపోయింది. ఉత్తరప్రదేశ్‌ మధుర సమీపంలోని మిథౌలి గ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఆదివారం సాయంత్రం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

మధుర ఎంపీ హేమమాలిని మిథౌలీలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో పాల్గొనేందుకు వెళ్తుండగా భారీ ఈదురుగాలల కారణంగా ఆమె కాన్వాయ్‌కి ముందు చెట్టు పడిపోయిందని పోలీసులు తెలిపారు. కొన్ని సెకన్లు ఆలస్యంగా చెట్టు నేలకూలింటే ఎంపీ కాన్వాయ్‌పై పడేదని చెప్పారు. అదృష్టవశాత్తూ ఆమె ప్రమాదం నుంచి బయటపడ్డారని వెల్లడించారు. కాగా, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కురుస్తున్న అకాల వర్షాటకు దాదాపు 50 మంది మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు, ఇసుక తుపానులు బీభత్సం సృష్టిస్తున్నాయి.

హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, హరియాణ, చండీగఢ్‌, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌, అసోం, మేఘాలయ, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడులో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

మరిన్ని వార్తలు