మణిపూర్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన నజ్మా

21 Aug, 2016 13:36 IST|Sakshi
మణిపూర్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన నజ్మా

ఇంఫాల్: బీజేపీ సీనియర్ నాయకురాలు నజ్మా హెప్తుల్లా మణిపూర్ 18వ గవర్నర్గా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంఫాల్లోని రాజ్భవన్ దర్బార్ హాల్లో ఆమె చేత ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాకేష్ రాజన్ ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మణిపూర్ ముఖ్యమంత్రి ఒక్రమ్ ఇబోబి సింగ్, పలువురు రాష్ట్రమంత్రులతోపాటు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

అలాగే వివిధ శాఖల కార్యదర్శులతోపాటు పోలీసు, ఆర్మీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. మోదీ మంత్రివర్గంలో మైనారటీ వ్యవహారాల శాఖ మంత్రిగా విధులు నిర్వహించిన నజ్మా జులై 12వ తేదీన ఆ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆమె వయస్సు 75 ఏళ్లు దాటిన నేపథ్యంలో ఆమె మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆమెను మణిపూర్ గవర్నర్గా నియమిస్తూ రాష్ట్రపతి గత వారం ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.
 

మరిన్ని వార్తలు