మోదీ, అక్షయ్‌లపై సెటైర్‌కి ట్రంప్‌ను వాడిన హీరో

4 May, 2019 20:06 IST|Sakshi

ప్రధాని నరేంద్ర మోదీని ఇంటర్వ్యూ చేసిన దగ్గర నుంచి, పౌరసత్వంపై వివరణ ఇచ్చుకునే వరకు బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్‌ను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. మోదీని అడగాల్సిన ప్రశ్నలు అక్షయ్‌ అడగలేదని, ‘నాన్‌-పొలిటికల్‌’ ఇంటర్వ్యూలా ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు కురిపించారు. దానికి కొనసాగింపుగా అక్షయ్‌ ఓటువేయకపోవడంతో ఆయన పౌరసత్వంపై కూడా నెటిజన్లు ట్రోల్‌ చేశారు. ఇక తాజాగా హీరో సిద్ధార్థ్ ట్విటర్‌ వేదికగా మోదీ, అక్షయ్‌లపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను వాడి సెటైర్లు వేశాడు.

మోదీని అక్షయ్‌ చేసిన ఇంటర్వ్యూపై సిద్దార్థ్ పరోక్షంగా వ్యాఖ్యలు చేశాడు. 'హేయ్‌ డొనాల్డ్‌ ట్రంప్‌.. మీరు త్వరలో ఎన్నికలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు నాతో ఇంటర్వ్యూ చేయించుకోవాలని మీకు సలహా ఇస్తున్నా. నా వద్ద చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయి. మీరు ఎలా నిద్ర పోతారు, ఎలాంటి పళ్ళు తింటారు, మీ క్యూట్‌ పర్సనాలిటీ గురించి నేను అడుగుతా' అంటూ అక్షయ్ కుమార్ పై పరోక్షంగా సిద్ధార్థ్‌ వ్యాఖ్యలు చేశారు. అక్షయ్ కుమార్ ఇలాంటి ప్రశ్నలే మోదీని అడిగిన సంగతి తెలిసిందే. అమెరికా ప్రెసిడెంట్‌ ఎన్నికలకు ఇంకా ఏడాదిపైగానే సమయం ఉండటంతో మోదీని ప్రస్తావించడానికే ట్రంప్‌ను సిద్ధార్థ్‌ వాడారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

అక్షయ్ కుమార్ పౌరసత్వం గురించి కూడా సిద్ధార్థ్‌ పరోక్షంగా వ్యాఖ్యానించారు. డోనాల్డ్ ట్రంప్.. నాకు ఇండియన్ పాస్ పోర్ట్ ఉంది. దయచేసి డైరెక్ట్‌ మెసేజ్‌ చేయండి అని సిద్దార్థ్ పోస్ట్‌ పెట్టారు. అక్షయ్ కుమార్‌కు కెనడా పాస్ పోర్ట్ ఉండటం వల్లే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటు వేయలేదని సామాజిక మాధ్యమాల్లో ట్రోల్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్షయ్‌ కుమార్‌ ట్విటర్‌లో వివరణ కూడా ఇచ్చారు.

>
మరిన్ని వార్తలు