చిదంబరం స్టేడియం వద్ద తీవ్ర ఉద్రిక్తత

10 Apr, 2018 17:30 IST|Sakshi

సాక్షి, చెన్నై : కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డు వ్యవహారంపై తమిళనాడు రగిలిపోతుండగా.. మరోవైపు ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణ తంబీలకు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. నేటి సీఎస్‌కే-కేకేఆర్‌ మ్యాచ్‌ను అడ్డుకుని తీరతామన్న ఆందోళనకారులు.. స్టేడియాన్ని ముట్టడించేందుకు విఫలయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో స్టేడియం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు అరెస్టుల పర్వం కొనసాగుతున్నప్పటికీ.. భారీ భద్రత వలయాన్ని చేధించుకుంటూ ఆందోళనకారులు స్టేడియం వద్దకు దూసుకొస్తున్నారు. భారీ భద్రత నడుమ సీఎస్‌కే-కేకేఆర్‌ టీమ్‌ సభ్యులు మైదానంకు చేరుకున్నారు. స్టేడియం దారులన్నీ తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు.. పాసులను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే ప్రేక్షకులను లోపలికి అనుమతిస్తున్నారు. దీంతో తమిళ సంఘాలు స్టేడియం దగ్గర్లోని కూడలిలో ఆందోళన చేపట్టాయి. ప్రస్తుతం మైదానం వద్ద చోటుచేసుకున్న పరిస్థితులపై ఐపీఎల్‌ చైర్మన్‌ రాజీవ్‌ శుక్లా స్పందించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ మ్యాచ్‌లను నిర్వహించేందుకు చెన్నై పోలీసులు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు.(ఐపీఎల్‌ మ్యాచ్‌లు.. రాజకీయాలొద్దు)

మరిన్ని వార్తలు