కరోనా : మహిళ అంత్యక్రియలు అడ్డుకున్నందుకు

27 May, 2020 14:29 IST|Sakshi

సిమ్లా : కరోనాతో చనిపోయిన వ్యక్తికి సంబంధించిన అంత్యక్రియలను అడ్డుకున్నందుకు గాను హిమాచల్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతతో పాటు ముగ్గురు కౌన్సిలర్లు, మరో 16 మందిపై హిమాచల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. 63 ఏళ్ల కిడ్నీ పేషెంట్‌ అయిన మహిళకు కరోనా సోకడంతో మండిలోని శ్రీ లాల్‌ బహుదూర్‌ శాస్ర్తి గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీలో ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. కాగా ఆమె సోమవారం మృతి చెందడంతో అంత్యక్రియలు నిర్వహించడానికి సొంతూరుకు తీసుకువచ్చారు. దహన సంస్కారాలకు అంతా సిద్దం చేస్తుండగా ఇంతలో మండి జిల్లా కాంగ్రెస్‌ చీఫ్‌ సుమన్‌ చౌదరీ కాంగ్రెస్‌ కార్యకర్తలతో పాటు కన్సా, తన్వా గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలను వెంటబెట్టుకొని అంత్యక్రియలు నిర్వహించే చోటుకు చేరుకున్నారు.
(వైరలవుతోన్న పెరూ మేయర్‌ చావు ఫోటోలు)

కరోనా వైరస్‌ సోకిన మహిళ దహన కార్యక్రమాలు నిర్వహించడానికి వీలు లేదంటూ రోడ్డు మొత్తం బ్లాక్‌ చేస్తూ మహిళ మృతదేహం ఉన్న ఆంబులెన్స్‌ను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సుమన్‌ చౌదరీతో పాటు ముగ్గురు కౌన్సిలర్లు, మరో 16 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఇదే సుమన్‌ చౌదరీ కొన్ని రోజుల క్రితం కరోనా యోదులకు సలాం చేస్తూ 'కరోనాను ఓడిద్దాం.. మానవత్వాన్ని కాపాడుదాం' అంటూ ప్లకార్డును చేత పట్టుకున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఇప్పుడు కరోనా సోకి చనిపోయిన మహిళ అంత్యక్రియలను అడ్డుకొని తాను మానవత్వం మరిచిందంటూ పేర్కొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా ఉంటూ అంత్యక్రియల కార్యక్రమం అడ్డుకోవడంతో మానవత్వాన్ని మరిచి రాష్ట్రంలో పార్టీ పరువు తీశారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. (మటన్‌ వ్యాపారి ఇంట్లో 14 కరోనా కేసులు)

మరిన్ని వార్తలు