కాంగ్రెస్‌ నేత, ఎంపీ శశి థరూర్‌పై అరెస్ట్‌ వారెంట్‌

14 Aug, 2019 08:02 IST|Sakshi

'హిందూ పాకిస్థాన్'   వ్యాఖ్య,  శశి థరూర్‌పై  అరెస్ట్ వారెంట్

 పిటిషన్‌ దాఖలు చేసిన సుమీత్‌ చౌదరి

సాక్షి, కోలకతా : కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‌పై అరెస్ట్‌ వారెంట్‌జారీ అయింది. గత ఏడాది (2018, జులై) జరిగిన కార్యక్రమంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో కోల్‌కతా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 'హిందూ పాకిస్తాన్' అంటూ శశి థరూర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని తిరువనంతపురానికి చెందిన న్యాయవాది సుమీత్ చౌదరి కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ను విచారించిన కోర్టు, థరూర్కు నోటీసులు జారీ చేసింది. కోర్టు సమన్లను ఖాతరు చేయకపోవడంతో, ఆయనపై అరెస్ట్ వారెంట్ ను జారీ చేస్తూ  చీఫ్‌ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌ దీపాంజన్‌ సేన్‌ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి విచారణను సెప్టెంబరు 24కి వాయిదా వేశారు.

కోలకతాలో జరిగిన కార్యక్రమంలో థరూర్ చేసిన ప్రకటన వివాదానికి దారితీసింది. 2019 ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే, దేశాన్ని 'హిందూ పాకిస్తాన్'గా మారుస్తుందని శశి థరూర్‌ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడున్న ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రద్దు చేసి..కొత్త రాజ్యాంగాన్ని తీసుకొస్తుందని, ఫలితంగా ప్రజాస్వామ్యం మనుగడ సాగించడం అసాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు, అదే జరిగితే దేశంలో మైనారిటీలకు రక్షణ ఉండదని...అంతిమంగా సరికొత్త ‘హిందూ పాకిస్థాన్’గా దేశాన్ని మారుస్తారంటూ ఘాటుగా విమర్శించారు.  థరూర్ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రధానంగా 'హిందూ పాకిస్తాన్' అని  పేర్కొనడం అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. దీనిపై మండిపడిన బీజేపీ శ్రేణులు కాంగ్రెస్‌ కార్యాలయంపై దాడి కూడా  చేశాయి. అప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేయడం తెలిసిందే. 

మరిన్ని వార్తలు