హిందూదేశంగా మార్చాలి: భాగవత్

19 Jan, 2015 02:35 IST|Sakshi

సాగర్: నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ ఆకాంక్షించినట్లు హిందూ మతం భిన్నత్వంలో ఏకత్వాన్ని విశ్వసిస్తుందని.. భారత్‌ను హిందూ దేశంగా మార్చాలని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భాగవత్ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో ఆదివారం ముగిసిన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో భాగవత్ ప్రసంగిస్తూ.. భారత్ హిందూ దేశంగా మారాలంటూ అందుకు ఠాగూర్ రచించిన ‘స్వదేశీ సమాజ్’ పుస్తకాన్ని ఉటంకించారు.

‘ పుస్తకంలో ఠాగూర్ బ్రిటిష్‌వారిని విమర్శించారు. హిందువులు, ముస్లింలు తమలో తాము కొట్లాడుకోవటం ద్వారా ఒకరినొకరు అంతం చేసుకోబోరని వారు ఉమ్మడిగా ఒక మార్గం కనిపెడతారని ఆ మార్గం హిందూదేశమని చెప్పారు’ అని పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని, సామరస్యాన్ని హిందుత్వం సమర్థిస్తుందన్నారు.

ఒక దేశ ప్రజలు అభద్రతాభావంలో ఉన్నప్పుడు ఆ దేశం భద్రంగా ఉన్నట్లు చెప్పలేమన్నారు. ఎడారి, తక్కువ, జనాభా, విదేశీ దాడులు వంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ అభివృద్ధి చెందిందని ప్రశంసించారు.  ‘భారత్‌కు  5,000 కిలోమీటర్ల భూమి ఉంది. కోట్లాది మంది జనాభా ఉంది. శక్తిమంతమైన నాయకులు ఉన్నారు. కానీ ఇజ్రాయెల్ మనల్ని దాటి ముందుకెళ్లిపోయింది’ అని అన్నారు.

మరిన్ని వార్తలు