అయ్యప్ప భక్తులకోసం కుటుంబశ్రీ మిషన్‌

21 Dec, 2017 19:04 IST|Sakshi

సాక్షి, తిరువనంతపురం : నవంబర్‌ నుంచి జనవరి మధ్య కాలంలో శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు దక్షిణాది రాష్ట్రాల నుంచి భారీగా భక్తుల వస్తుంటారు. వీరిలో 65 శాతం మంది సొంత వాహనాలతో శబరిమలకు రావడం జరుగుతుంది. సొంత వాహనాల్లో వచ్చే భక్తులు.. రోడ్లకు ఇరువైపులా వాహనాలను నిలిపి వంట చేసుకోవడం పరిపాటి. ఇలా రోడ్ల పక్కన వంట చేసుకుని.. ఆపై వాటిని ఆలాగే వదిలివేయడం వల్ల భారీగా కాలుష్యం జరుగుతోంది. దీనిని నివారించేందుకు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు ‘కుటుంబశ్రీ’ మిషన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. 

ఈ మిషన్‌కింద ఎంపిక చేసిన ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా.. టీడీబీ తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేస్తుంది. అందులో విశ్రమించడంతో పాటు.. వంటకు అవసరమైన పాత్రలు, గ్యాస్‌, నీరు, ఇతర వస్తువులను అందించడం జరుగుతుంది. వంట చేసుకుని భోజనం చేశాక.. కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం చాలా తక్కువగా ఉంటుందని టీడీబీ అధికారులు ప్రకటించారు. కుటంబశ్రీ మిషన్‌ కింద ఇప్పటికే పథినంతిట్ట, నీలక్కల్‌, శబరిమల ప్రాంతాల్లో షెల్టర్లు ఏర్పాటు చేసినట్లు టీడీబీ ప్రకటించింది. మిగిలిన ప్రాంతాల్లో కూడా.. జనవరి 5 లోపు ఏర్పాటు చేయడం జరుగుతుందని టీడీబీ తెలిపింది. 

మరిన్ని వార్తలు