మా ఎంపీ వ్యాఖ్యలు అసత్యాలు: హోంమంత్రి

26 Sep, 2015 16:29 IST|Sakshi
మా ఎంపీ వ్యాఖ్యలు అసత్యాలు: హోంమంత్రి

లక్నో: బిహార్కు చెందిన బీజేపీ ఎంపీ ఆర్కే సింగ్ సొంత పార్టీపై చేసిన వ్యాఖ్యలను కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఖండించారు. ఎంపీ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని లక్నోలో శనివారం జరిగిన  ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పేర్కొన్నారు. సీట్ల కేటాయింపులు న్యాయబద్ధంగా జరిగాయన్నారు. ఓ విలేకరి ప్రశ్నకు రాజ్నాథ్ బదులిస్తూ.. ప్రజల మద్ధతుతో బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ మెజారిటీ విజయాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంపీ చేసినవి అసత్య ఆరోపణలంటూ ఆయన మండిపడ్దారు.

ఇదిలా ఉండగా బీజేపీ ఎంపీ ఆర్కే సింగ్ సొంతపార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తమ పార్టీ నేతలు డబ్బులు తీసుకుని టిక్కెట్లు అమ్ముకుంటున్నారని  ఆరోపించారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న వారిని, ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవారిని విస్మరించి.. బంధువులకు, నేరస్తులకు టికెట్లు కేటాయిస్తున్నారని ఆర్కేసింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.

మరిన్ని వార్తలు