‘విక్రమ్‌’తో సంబంధం కష్టమే!

14 Sep, 2019 03:45 IST|Sakshi

బెంగళూరు: చంద్రయాన్‌–2 ప్రయోగంలో భాగంగా సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కావాల్సిన విక్రమ్‌ ల్యాండర్‌తో సంబంధాల పునరుద్ధరణకు అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. పునరుద్ధరణకు ఇంకా వారం మాత్రమే సమయం ఉండటంతో అవకాశాలు మృగ్యమవుతున్నాయి. ఎందుకంటే ఈ ల్యాండర్‌ 14 రోజులు మాత్రమే (చంద్రుడిపై ఒక్కరోజు) మనుగడలో ఉంటుంది. సెప్టెంబర్‌ 7న విక్రమ్‌ చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అవ్వాల్సి ఉండగా, 2.1 కిలోమీటర్ల దూరంలో ఇస్రోతో సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే.

విక్రమ్‌ ల్యాండర్‌ ఆచూకీ తెలిసిందని 8వ తేదీన ఇస్రో ప్రకటించింది. అప్పటినుంచి విక్రమ్‌తో సంబంధాల పునరుద్ధరణకు శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ‘ప్రతి గంట, ప్రతి నిమిషం ఇప్పుడు ఎంతో విలువైనది. విక్రమ్‌కు ఉన్న బ్యాటరీలో శక్తి రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది. తిరిగి శక్తిని నింపుకొనేందుకు ఎలాంటి వెసులుబాటు లేదు. అలాంటప్పుడు వచ్చే వారం రోజులు ఎంతో కీలకమైనవి’అని ఇస్రో పేర్కొంది.  అయితే, హార్డ్‌ ల్యాండింగ్‌ కారణంగా విక్రమ్‌ ల్యాండర్‌కు కొంత నష్టం జరిగి ఉండొచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు