హైదరాబాద్: ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ సంఘటన నగరంలోని గచ్చిబౌలి పోలీస్స్టేసన్ పరిధిలో సోమవారం వెలుగు చూసింది. స్థానిక సుదర్శన్ నగర్లో నివాసముంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ గిరీష్ నర్సింహకు ఏడాది క్రితం పద్మజ అనే మహిళతో వివాహమైంది. పద్మజ బ్యాంక్ ఆఫ్ అమెరికాలో మేనేజర్గా పని చేస్తోంది.
అయితే, అనుమానాస్పద స్థితిలో మృతిచెందడంతోపాటు ఆమె నుదుటిపై బలమైన గాయాలు ఉండటంతో భర్తే హత్య చేసి ఆత్మహత్యలా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నాడంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. గతకొద్ది రోజులుగా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని, వారి మధ్య కొంత కాలంగా సఖ్యత లోపించి తరచు గొడవలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఆమె భర్త నర్సింహను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.