విద్యాసంస్థలకు హెచ్‌ఆర్డీ గైడ్‌లైన్స్‌

2 May, 2020 03:18 IST|Sakshi

జులైలో సెమిస్టర్‌ పరీక్షలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన యూజీసీ

న్యూఢిల్లీ: పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభమయ్యాక విద్యార్థుల రక్షణకోసం చేపట్టాల్సిన చర్యలపై మానవ వనరుల మంత్రిత్వ శాఖ తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. పాఠశాలల్లో ఉదయపు అసెంబ్లీలను రద్దు చేయడం. క్రీడాకార్యకలాపాలను నిలిపివేయడం, స్కూల్‌ బస్సులకు నిబంధనలను తయారుచేయడం, స్కూల్‌ యూనిఫామ్‌లో మాస్కులను తప్పనిసరి చేయడం. మరుగుదొడ్లు వినియోగించడంలో పాటించాల్సిన నియమాలూ, క్యాంటీన్ల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు విద్యాసంస్థల భవనాలను క్రమం తప్పకుండా డిస్‌ఇన్ఫెక్ట్‌ చేయడం లాంటి కీలకమైన విషయాలు ఈ మార్గదర్శకాల్లో ఉన్నాయి.

ఇప్పటికే ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ లాంటి కొన్ని విద్యాసంస్థల్లో భౌతిక దూరం పాటించేందుకూ, విజిటర్స్‌ని పరిమితం చేసేందుకూ, షిఫ్ట్‌ల విధానంలో తరగతులు, లాబొరేటరీల సమయాల్లో మార్పు చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆన్‌లైన్‌ పరీక్షలు, పోటీ పరీక్షల నిర్వహణలో కూడా రక్షణ చర్యలు చేపట్టాలని ఆ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. నూతన విద్యార్థులకు సెప్టెంబర్‌ నుంచి, సీనియర్‌ విద్యార్థులకు ఆగస్టు నుంచి తరగతులు ప్రారంభించనున్నటు యూజీసీ  ప్రకటించింది. సెమిస్టర్‌ పరీక్షలను ఆన్‌లైన్‌లో కానీ, నేరుగా గానీ జూలై నెలలో నిర్వహించుకోవచ్చని యూజీసీ సిఫార్సు చేసింది. పది, పన్నెండు తరగతులలో మిగిలిన సబ్జెక్టులకు పరీక్షలను త్వరలోనే నిర్వహించనున్నట్టు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌సీ) తెలిపింది.

మరిన్ని వార్తలు