కల్కిని నేను.. ఆఫీసుకు రాను..!

19 May, 2018 06:11 IST|Sakshi

అహ్మదాబాద్‌: ‘విష్ణుమూర్తి పదో అవతారమైన కల్కిని నేను. ప్రపంచాన్ని మార్చేందుకు యాగం చేస్తున్నా. అందుకే ఆఫీసుకు రావట్లేను. నా యజ్ఞం వల్లే ఇరవయ్యేళ్లుగా దేశంలో పుష్కలంగా వానలు కురుస్తున్నాయి’ అంటూ గుజరాత్‌ ప్రభుత్వ అధికారి ఒకరు ప్రకటించుకున్నారు. రమేశ్‌చంద్ర ఫెఫర్‌(55) అనే ఆయన సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ నిర్వాసితులకు పరిహారం అందించే శాఖలో సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన గత ఆరు నెలలుగా ఆఫీసుకు రావట్లేదు. అధికారులు మూడు రోజుల క్రితం ఆయనకు షోకాజ్‌ నోటీసులిచ్చారు. నోటీసులు అందుకున్న రమేశ్‌చంద్ర..‘కల్కి అవతారంలో ఈ లోకాన్ని మార్చేందుకు యాగం చేస్తున్నా. ఆఫీసులో యాగం చేయడం కుదరదు. అందుకే ఇంట్లో చేస్తున్నా. యాగం ఫలించి 19ఏళ్లుగా దేశంలో సమృద్ధిగా వానలు పడుతున్నాయి’ అంటూ రెండు పేజీల వివరణ ఇచ్చారు. శుక్రవారం రాజ్‌కోట్‌లో మాట్లాడారు. ‘ఆఫీసులో కూర్చుని కాలక్షేపం చేయటం ముఖ్యమా లేక దేశాన్ని కరువు నుంచి కాపాడటం ముఖ్యమా అనేది పైఅధికారులే నిర్ణయించాలన్నారు. 

మరిన్ని వార్తలు