టీవీ చానళ్లలో ఆ పదం వాడకూడదు

4 Sep, 2018 09:45 IST|Sakshi

న్యూఢిల్లీ: షెడ్యూల్‌ కులాలకు చెందిన వారి ప్రస్తావన వచ్చినప్పుడు దళితులు అనే పదాన్ని వాడకూడదని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఎంఐబీ) టీవీ చానళ్లకు సూచించింది. ముంబై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎంఐబీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం ప్రవేటు శాటిలైట్‌ టీవీ చానళ్లకు ఈ నిబంధన వర్తించనుంది. వార్తాపత్రికలు, మ్యాగజైన్‌లు ఈ విషయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై ఎంఐబీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

ఎంఐబీ ప్రవేటు చానళ్లకు రాసిన లేఖలో.. మీడియా దళితులు అనే పదానికి బదులు షెడ్యూల్‌ కులాలు అనే పదాన్ని వాడాల్సి ఉంటుందని తెలిపింది.దళిత్‌ అనే పదానికి బదులుగా రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా ఇంగ్లిష్‌లో షెడ్యూల్‌ క్యాస్ట్‌ అని గానీ, దేశంలో ఇతర జాతీయ భాషల్లో దానికి సరిపడు అనువాదాన్ని గానీ వాడాల్సి ఉంటుందని.. అధికారిక లావాదేవీలకు, వ్యవహారాలకు, ధృవపత్రాలకు సంబంధించిన వాటిలో ఈ నిబంధన వర్తిస్తుందని కోర్టు తెలిపిందన్న విషయాన్ని ప్రస్తావించింది.

కానీ ఈ సూచనలు పాటించకపోతే ఎటువంటి చర్యలు తీసుకుంటామనే దానిపై ఎంఐబీ స్పష్టతనివ్వలేదు. కాగా ప్రభుత్వ దస్త్రాల్లో, సమాచార మార్పిడిలో దళిత్‌ అనే పదం వాడకూడదనే పిటిషన్‌పై విచారణ జరిపిన ముంబై హైకోర్టు నాగ్‌పూర్‌ బెంచ్‌ ఈ మేరకు జూన్‌లో తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ కూడా కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వ విభాగాల్లో దళితులు అనే పదానికి బదులు షెడ్యూల్‌ కులాలు వాడాలని మార్చి 15వ తేదీన సర్య్కూలర్‌ జారీ చేసింది.

మరిన్ని వార్తలు