నా పాస్‌వర్డ్‌ ఇవ్వలేదు.. ఇచ్చే సమస్యే లేదు

9 Mar, 2018 18:47 IST|Sakshi
రిమాండ్‌కు వెళుతున్న కార్తీ చిదంబరం

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు తన ఫోన్‌ పాస్‌వర్డ్‌ చెప్పలేదని, చెప్పే సమస్యే లేదని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్తీ చిదంబరం స్పష్టం చేశారు. ఓ మీడియాతో ఆయన మాట్లాడుతూ కోర్టుల్లో జరుగుతున్న వాదోపవాదాలను తాను ప్రస్తుతం పరిశీలిస్తున్నట్లు చెప్పారు. గత విచారణ సందర్భంగా కార్తీ తన మొబైల్‌ పాస్‌వర్డ్‌ను చెప్పడం లేదని, అందుకు ఆదేశించాలంటూ కోర్టును సీబీఐ కోరిన విషయం తెలిసిందే.

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత చిదంబరం తనయుడు కార్తీ చిదంబరాన్ని ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఫిబ్రవరి 28న చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో సీబీఐ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా విచారణ ఎదుర్కొంటున్న ఆయన బెయిల్‌ పిటిషన్‌ పెట్టుకున్నారు. దీనిపై శుక్రవారం కోర్టుకు రాగా బెయిల్‌ పిటిషన్‌ ను మార్చి 15కు వాయిదా వేసిన కోర్టు.. ఆయన కస్టడీని మరో మూడు రోజులు పొడిగించింది. ఆరు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అభ్యర్థించగా.. కోర్టు మాత్రం మూడు రోజులకు అనుమతిచ్చింది. బెయిల్‌ పిటిషన్‌పై విచారణకు వచ్చిన నేపథ్యంలోనే ఆయనను మీడియా ప్రతినిధులు మొబైల్‌ పాస్‌వర్డ్‌ పై ప్రశ్నించారు. దానికి బదులిచ్చిన కార్తీ 'సీబీఐకి నా మొబైల్‌ పాస్‌వర్డ్‌ ఇవ్వలేదు. ఎప్పటికీ ఇవ్వను కూడా' అని ఆయన స్పష్టం చేశారు. కార్తీని ఆయన అడిటర్‌తో సహా విచారణ చేపట్టే అవకాశం ఉందని.. అవసరమైతే నార్కో పరీక్షలు కూడా నిర్వహించే యోచనలో సీబీఐ ఉన్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు