‘త్యాగిని అస్సలు కలవలేదు.. జూలీని పార్టీలో..’

9 Dec, 2016 20:01 IST|Sakshi
న్యూఢిల్లీ: తాను వైమానిక దళ మాజీ అధిపతి ఎస్పీ త్యాగిని అస్సలు కలవలేదని దేశంలో సంచలనం సృష్టించిన అగస్టా వెస్ట్‌ ల్యాండ్‌ హెలికాప్టర్ల కొనుగోళ్ల కుంభకోణం మధ్యవర్తి బ్రిటన్‌ పౌరుడు క్రిస్టియన్‌ మైఖెల్‌ తెలిపాడు. అయితే, త్యాగి కజిన్‌ సంజీవ్‌ అలియాస్‌ జూలీ త్యాగిని మాత్రమే ఓ పార్టీలో కలిశానని చెప్పాడు. ఆ సమయంలోనే జూలీ త్యాగి తనకు శక్తి వనరుల రంగంలో పనిచేస్తున్న ఓ ప్రభావవంతమైన వ్యక్తిని పరిచయం చేసినట్లు తెలిపాడు. అగస్టా కంపెనీ తరుపున తాను మధ్యవర్తిగా పని చేస్తున్న సమయంలో త్యాగితో అధికారికంగా అస్సలు మాట్లాడనే లేదని, కలవలేదని వివరించారు.  
 
అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోళ్ల కుంభకోణం కేసు విషయంలో వైమానికదళ మాజీ అధిపతి ఎస్పీ త్యాగిని శుక్రవారం సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీకి చెందిన న్యాయవాది గౌతమ్‌ ఖైతాన్‌, సంజీవ్‌ త్యాగి అలియాస్‌ జూలీ త్యాగిని కూడా సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అగస్టా వెస్ట్ ల్యాండ్ ఒప్పందంలో ఈ ముగ్గురు అక్రమాలకు పాల్పడినట్టు సీబీఐ ఆరోపించింది. దీంతో త్యాగి అరెస్టు నేపథ్యంలో ఈ కుంభకోణం బప్పందంలో కీలక మధ్యవర్తిగా పనిచేసిన క్రిస్టియన్‌ మైఖెల్‌ను ఓ మీడియా సంప్రదించగా ఆయన ఈ వివరాలు తెలియజేశారు.
మరిన్ని వార్తలు