సాక్షి, న్యూఢిల్లీ : బాలాకోట్ వైమానిక దాడుల అనంతరం పాకిస్తాన్ ఎన్నడూ వాస్తవాధీన రేఖ (ఎల్ఓసీ)ను దాటలేదని ఐఏఎఫ్ చీఫ్ బీరేందర్ సింగ్ ధనోవా పేర్కొన్నారు. భారత వైమానిక దళం తన సైనిక ఆశయం నెరవేర్చడంలో విజయవంతమవగా, పాకిస్తాన్ విఫలమైందని స్పష్టం చేశారు. పాక్ యుద్ధ విమానాలు ఎల్ఓసీని అతిక్రమించలేదని తెలిపారు. మన సైనిక స్ధావరాలపై దాడులు తలపెట్టాలన్న పాకిస్తాన్ కుట్ర ఫలించలేదని చెప్పారు.
వారు (పాక్) మన గగనతలంలోకి రాలేదని అదే మన విజయమని పేర్కొన్నారు. పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసివేయడం వారి సమస్యని, మన ఆర్థిక వ్యవస్ధకు విమాన ట్రాఫిక్ కీలకమని ఎయిర్ఫోర్స్ ఇప్పటివరకూ పౌరవిమాన ట్రాఫిక్ను నిలువరించలేదని ఆయన గుర్తుచేశారు. పాక్తో ఉద్రిక్తతల ప్రభావం పౌర విమానయానంపై పడకుండా వ్యవహరించామని చెప్పారు. కాగా పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత వైమానిక దళం పాకిస్తాన్లోని బాలాకోట్లో మెరుపు దాడులు చేపట్టి ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే.