అసలు ఏమైనా తెలుసా మీకు.. సుప్రీం చీవాట్లు

14 Dec, 2017 17:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ హైకోర్టులో కేసులు పెండింగ్‌ ఉండటంపై ఆ కోర్టు రిజిస్ట్రార్‌ సుప్రీంకోర్టులో నీళ్లు నమిలారు. ఉన్నత న్యాయస్థానం వరుసగా ఆయనకు ప్రశ్నలు సందించడంతో 'ఐయామ్‌ వెరీ నెర్వస్‌ మై లార్డ్‌' అంటూ మరో ప్రశ్న వేయకుండా సమాధానం చెప్పారు. వీలయినంత త్వరగా కేసులు విచారణకు వచ్చేలా చూస్తానని అన్నారు. భారీ ఎత్తున కేసులు పేరుకుపోవడం, కేసులు విచారణ ఆలస్యం జరుగుతుండటంపై ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ (ఆర్‌జీ)ని జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ ధర్మాసనం తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. జస్టిస్‌ గొగోయ్‌ ప్రశ్నించడం మొదలుపెట్టేసరికి ఆర్జీ కంగారు పడిపోయారు. న్యాయమూర్తి అడిగిన ఏ ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్పలేదు.

గత పదేళ్లుగా ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అడిగినా ఆయన నామమాత్రం కూడా సమాధానం చెప్పలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు అసలు మీరు కోర్టుకు ఎందుకు వచ్చారు? అసలు ఇక్కడ ఏ కేసు విచారణ జరుగుతుందనే విషయం అయినా తెలుసా? . 1994 నుంచి కేసులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయో అనే విషయం కూడా మీకు తెలియదు. మీకు కనీసం ఆ విషయం అయినా తెలుసుండాలి ? అని గొగోయ్‌ ప్రశ్నించింది. దీంతో నీళ్లు నమిలిన రిజిస్ట్రార్‌ 'అందుకు నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. ఐయామ్‌ వెరీ నెర్వస్‌ మై లార్డ్‌. దయచేసి నాకు కొంచెం గడువు ఇవ్వండి' అని ప్రార్థించాడు. దీనికి బదులిచ్చిన గొగోయ్‌ 'అయితే సరే.. మీకు కొంచెం గడువు ఇస్తున్నాను. ఆ సమయంలోగానైనా మీ నెర్వస్‌ పోతుందేమో చూస్తాము' అని అన్నారు.

మరిన్ని వార్తలు