‘ప్లాస్మా’పై 21 సంస్థలకు అనుమతి

7 May, 2020 08:15 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: కోవిడ్‌ నుంచి కాపాడేందుకు ప్లాస్మా థెరపీ క్లినికల్‌ ట్రయల్స్‌కి ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌) దేశంలోని 21 సంస్థలకు అనుమతినిచ్చింది. థెరపీ ద్వారా కోవిడ్‌ నుంచి కోలుకున్న వ్యక్తుల రక్తంలోని యాంటీబాడీస్‌ని సేకరించి, వాటిని కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయిన వ్యక్తుల శరీరంలోకి ప్రవేశపెడతారు. దీనివల్ల కోవిడ్‌ని ఎదుర్కోవడానికి కావాల్సిన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మొత్తం ఈ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు 111 సంస్థలు ఆసక్తి చూపగా, 21 సంస్థలకే అనుమతి లభించింది. ఐసీఎంఆర్‌ అనుమతి పొందిన వాటిలో తెలంగాణలోని గాంధీ మెడికల్‌ కాలేజీ ఉంది.    

కరోనా నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్య‌వంతులైన వారి నుంచి ప్లాస్మాను సేక‌రిస్తారు. దాత పూర్తి సమ్మతితోనే ప్లాస్మాను తీసుకుంటారు. 20 నుంచి 40 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు ఉండి, ఎలాంటి ఆరోగ్య స‌మ‌స్య‌లు లేవ‌ని నిర్ధార‌ణ అయితేనే వారి నుంచి ప్లాస్మా సేక‌రిస్తారు. కేవలం ప్లాస్మా కణాలు మాత్రమే సేకరించడం వల్ల దాతకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.  వారి శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా, వైరస్‌ను చంపే యాంటిబాడీస్‌ ప్లాస్మాలో పుష్కలంగా ఉంటాయి. ఒక దాత నుంచి 400 నుంచి 800 ఎంఎల్‌ ప్లాస్మా కణాలు సేకరించే అవకాశం ఉంది. (ఒక్క రోజులో 2,958 కరోనా పాజిటివ్‌ కేసులు)

>
మరిన్ని వార్తలు