ఈసీకి మొక్కాలా..?

23 Oct, 2017 14:29 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: హిమాచల్‌ ప్రదేశ్‌తో పాటు గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించకపోవడంపై చెలరేగిన దుమారం కొనసాగుతూనే ఉంది. ఎన్నికల కమిషన్‌ను (ఈసీ) ప్రశ్నించే అధికారం కాంగ్రెస్‌కు లేదని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ మండిపడింది.  గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎందుకు ప్రకటించలేదని ఈసీని కాంగ్రెస్‌ ప్రశ్నించడాన్ని ప్రధాని తప్పుపట్టడం పట్ల విస్మయం వ్యక్తం చేసింది.పౌరులు ఈసీని ప్రశ్నించకుంటే మరి ఎవరు ప్రశ్నిస్తారని నిలదీశారు. ‘పౌరులు ఇక ఏం చేయాలి ఈసీకి మొక్కాలా..? ’అంటూ చిదంబరం ట్వీట్‌ చేశారు. ఇటీవల గుజరాత్‌ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఓటమి పాలైన తర్వాత తిరిగి రీకౌంట్‌ జరిగిన అనంతరం ఆ పార్టీ అభ్యర్థి గెలిచారని..ఇందులో మతలబు ఉందని ప్రధాని చేసిన వ్యాఖ్యలనూ చిదంబరం తిప్పికొట్టారు.

తాము రాజ్యసభ ఎన్నికల కౌంటింగ్‌కు ముందే ఈసీకి ఫిర్యాదు చేశామని చెప్పారు.గుజరాత్‌ ఎన్నికల తేదీల ప్రకటనలో జాప్యం పట్ల ఈసీని గతంలో కూడా చిదంబరం విమర్శించారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించే అధికారం ప్రధానికి ఈసీ కట్టబెట్టిందని సెటైర్లు వేశారు.మరోవైపు గుజరాత్‌ ఎన్నికలను జాప్యం చేసేందుకు ఈసీ, బీజేపీ కుమ్మక్కయ్యాయని కాంగ్రెస్‌ ఆక్షేపించింది.

>
మరిన్ని వార్తలు