‘మరో కుమారుడు ఉంటే ఆర్మీలోకి పంపేదాన్ని’

5 Feb, 2018 17:59 IST|Sakshi
పాకిస్తాన్‌ కాల్పుల్లో మరణించిన కెప్టెన్‌ కపిల్‌ కుండు, ఆయన తల్లి సునీత, సోదరి సోనియా

గురుగ్రాం : తనకు మరో కుమారుడు ఉంటే తనను కూడా ఆర్మీలోకి పంపించి ఉండేదానినని పాక్‌ కాల్పుల్లో చనిపోయిన కెప్టెన్‌ కపిల్‌ కుండు తల్లి సునీత కుండు తెలిపారు. పాక్‌ ఆర్మీ జరిపిన కాల్పుల్లో  రామవతార్‌(28), శుభం సింగ్‌(22) అనే ఇద్దరు రైఫిల్‌ మెన్లు,  హవల్దార్‌ రోషన్‌ లాల్‌(42)తో పాటు కెప్టెన్‌ కపిల్‌ కుండు(23) చనిపోయిన సంగతి తెల్సిందే. కుమారుడు చనిపోయిన విషయం తెలిసి సునీత విషణ్ణ వదనంతో విలేకరులతో మాట్లాడారు. తన కుమారుడు భారత జాతి కోసం పరితపించేవాడని, ఆర్మీలో చేరిన తర్వాత చాలా ఆనందంగా ఉన్నట్లు కనిపించేవాడని చెప్పారు. అమరుల కోసం పాకిస్తాన్ పై మరిన్ని సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు.

తన కుమారుడు జీవించి ఉంటే మరో 10-15 సంవత్సరాలు భారత జాతి కోసం ఎంతో సేవ చేసే వాడని చెప్పారు.  తన సోదరుడితో ఆదివారం మధ్యాహ్నాం ఒంటి గంటకు ఫోన్‌లో మాట్లాడానని, అంతా మంచిగానే ఉందని తనతో అన్నాడని కపిల్‌ కుండు సోదరి  సోనియా వెల్లడించారు. కపిల్‌ కుండు స్వస్థలం హర్యానా రాష్ర్టం పటౌడీలోని రాన్సిక. ఎన్‌డీఏ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆర్మీలో చేరాడు. కపిల్‌ తండ్రి లాలారాం 2012లో గుండెపోటుతో చనిపోయాడు. కపిల్‌కు కవిత్వం అంటే చాలా ఇష్టమని అతని సోదరుడు తారిఫ్‌ కుండు తెలిపారు. జవానుల మృతికి సంతాపంగా పలువురు సోషల్‌ మీడియా ద్వారా తమ మెసేజ్‌ని షేర్‌ చేశారు.
 


 

మరిన్ని వార్తలు