ఆ సమయంలో రాఫెల్‌ యుద్ధ విమానాలుంటే..

12 Mar, 2019 17:42 IST|Sakshi
మాజీ ఆర్మీ జనరల్‌ బిక్రం సింగ్‌, మాజీ ఐఏఎఫ్‌ చీఫ్‌ ఏవై టిప్నిస్‌(కుడి)

న్యూఢిల్లీ: భారత వైమానిక దళం వద్ద రాఫెల్‌​ యుద్ధ విమానాలు ఉండి ఉంటే, అవి పాకిస్తాన్‌కు చెందిన యుద్ధ విమానాల్లో సగం కూల్చివేసి ఉండేవని భారత మాజీ ఐఏఎఫ్‌ చీఫ్‌, ఎయిర్‌ మార్షల్‌ ఏవై టిప్నిస్‌ అభిప్రాయపడ్డారు. ఏవై టిప్నిస్‌ మంగళవారం ఆజ్‌తక్‌ ఛానల్‌ నిర్వహించిన భద్రతా సదస్సులో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లోని శ్రీనగర్‌, అవంతిపురా ఎయిర్‌ బేస్‌లపై దాడిచేయడమే పాకిస్తాన్‌కు చెందిన 24 యుద్ధ విమానాల లక్ష్యమన్నారు.  మొన్న టెర్రరిస్టు స్థావరాలపై దాడి జరిగినపుడు ఇండియా దగ్గర రాఫెల్‌ యుద్ధవిమానాలుంటే, కనీసం 12 పాకిస్తాన్‌ యుద్ధవిమానాలు నేలకూలేవని వ్యాఖ్యానించారు.

ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేటపుడు ఇండియా నిశ్శబ్దంగా కూర్చోకూడదని, ప్రభుత్వం మారినప్పుడల్లా దాడుల ప్రణాళిక మారకూడదని హితబోధ చేశారు. దాడులు సరైన దిశలో జరగాలని సూచించారు. అలాగే పాకిస్తాన్‌తో దౌత్య, సాంస్కృతిక, క్రీడా సంబంధాలను తెంచుకుని వారిపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచాలని కోరారు. ఇదే సదస్సులో పాల్గొన్న మాజీ ఆర్మీ జనరల్‌ బిక్రం సింగ్‌ మాట్లాడుతూ.. ఇండియా, పాకిస్తాన్‌ ప్రధాన స్థావరంపై దెబ్బకొట్టాలని, అప్పుడే పాకిస్తాన్‌ మాటపై నిలబడుతుందని వ్యాక్యానించారు. పాకిస్తాన్‌లో టెర్రరిజం అనేది ఉద్యోగం లాంటిదని, అక్కడి ప్రభుత్వం సరైన విధంగా చర్యలు తీసుకుంటేనే టెర్రరిజం అంతమవుతుందని అన్నారు.

మరిన్ని వార్తలు