ఈ–కారు.. యువతలో హుషారు

12 Jan, 2020 10:16 IST|Sakshi

పచ్చదనం, పర్యావరణం ఇప్పుడు మన దేశ యువత దీనికే అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఒక స్టార్టప్‌ కంపెనీ స్థాపించినా, ఒక కొత్త ఆవిష్కరణ చేపట్టినా దానిలో అంతర్లీనరంగా పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నం ఉంటోంది. వారణాసి ఐఐటీ (బీహెచ్‌యూ)కి చెందిన విద్యార్థుల బృందం తయారు చేసిన అత్యంత అరుదైన ఈ–కారు భారత్‌లో అత్యంత నైపుణ్యం కలిగిన ఎలక్ట్రిక్‌ కారుగా రికార్డులకెక్కింది. ఈ కారు పేరు ఆల్టెర్నో. దీని బరువు దాదాపుగా 40 కేజీలు ఉంటుంది. కానీ ఈ కారు సామర్థ్యం అపారం. ఒక్కసారి బ్యాటరీని చార్జ్‌ చేస్తే చాలు ఏకధాటిగా 349 కి.మీ. ప్రయాణిస్తుంది.

వివిధ దేశాల్లో జరిగే ఎకో మారథాన్‌ పోటీల్లో ఈ కారులో ప్రయాణిస్తూ ఐఐటీ విద్యార్థులు పాల్గొని ఎన్నో బహుమతులు పొందారు. చెన్నైలో జరిగిన షెల్‌ ఎకో మారథాన్‌ (సెమ్స్‌) పోటీలో భారత్‌లోనే అత్యంత సమర్థవంతమైన ఎలక్ట్రిక్‌ కారుగా మొదటి స్థానంలో నిలిచింది. ఆసియా దేశాల్లో మూడో స్థానాన్ని దక్కించుకుంది. గత ఏడాది మలేసియాలో జరిగి సెమ్స్‌ పోటీలో ఈ బ్యాటరీ కారు తయారు చేసిన బృందానికి రెండో బహుమతి వచ్చింది. ఆసియాలోనే ఇంధన సామర్థ్యం కలిగిన కారుని రూపొందించడమే తమ ముందున్న లక్ష్యమని ఈ బృందం సభ్యులు నినదిస్తున్నారు. వారికి ఆల్‌ది బెస్ట్‌ మనమూ చెప్పేద్దామా !

మరిన్ని వార్తలు