సెకన్లలో కూల్చేశారు

12 Jan, 2020 04:10 IST|Sakshi

కొచ్చి: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అక్రమ భవనాలపై కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా కేరళలోని మారడులో నిర్మించిన రెండు భవంతులను శనివారం కూల్చివేసింది. హోలీ ఫెయిత్‌ హెచ్‌2ఓ, ఆల్ఫా సెరీన్‌ అపార్ట్‌మెంట్‌లోని ట్విన్‌ టవర్లను పేలుడు పదార్థాల సాయంతో కూల్చివేశామని అధికారులు వెల్లడించారు. దీనికి గానూ మొత్తం 212.4 కేజీల పేలుడు పదార్థాలను ఉపయోగించామని పేర్కొన్నారు. మొత్తం 19 అంతస్తులు ఉన్న హోలీ ఫెయిత్‌ భవనం సెకన్ల వ్యవధిలో నేలకూలిందని చెప్పారు.

హోలీ ఫెయిత్‌ను శనివారం ఉదయం 11.18 గంటలకు, ఆల్ఫా సెరీన్‌ను 11.46కి కూల్చివేసినట్లు తెలిపారు. భవంతుల కూల్చివేతకు ముందు సమీపంలోని ప్రజలకు, ఆస్తులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ఆల్ఫా సెరీన్‌ను కూల్చే క్రమంలో సమీప భవంతులకు నష్టం వాటిల్లకుండా.. కొంతభాగం నీటిలో పడేలా ఏర్పాటు చేశామని తెలిపారు. అనుకున్న రీతిలోనే భవంతి వ్యర్థాలు నీటిలో పడ్డాయని పేర్కొన్నారు. కేరళలో తీర ప్రాంతాల నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలని సుప్రీంకోర్టు 2019 సెప్టెంబర్‌లో ఆదేశించింది. 138 రోజుల్లోగా ఈ భవనాలను కూల్చివేయాలని తెలిపింది.

మరిన్ని వార్తలు