యాపిల్స్‌ నుంచి మొబైల్స్‌ వరకూ అన్నీ ప్రియం..

13 Aug, 2018 12:47 IST|Sakshi

న్యూఢిల్లీ : యాపిల్స్‌ నుంచి మొబైల్స్‌ వరకూ ఇక చాలా ఐటెమ్స్‌ ధరలు భారం కానున్నాయి. గత కొన్నేళ్లుగా వరుసగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న కస్టమ్స్‌ సుంకం తగ్గింపు విధానానికి ప్రస్తుత సర్కార్‌ చెల్లుచీటీ ఇచ్చింది. గత రెండేళ్లలో పలు వస్తువులపై కస్టమ్స్‌ డ్యూటీని పెంచిన ఉదంతాలు పలుమార్లు చోటుచేసుకున్నాయి. సర్కార్‌ తాజా వైఖరితో బాదంపప్పులు, యాపిల్స్‌ నుంచి సెల్‌ఫోన్‌ విడిభాగాలు, సోలార్‌ ప్యానెల్స్‌ సహా దాదాపు 400 వస్తువులపై కస్టమ్స్‌ సుంకం పెరగనుంది.

ఆసియాన్‌ దేశాలకు సమానంగా టారిఫ్‌లను తీసుకువచ్చే క్రమంలో నీతిఆయోగ్‌ సిఫార్సుల మేరకు వ్యవసాయ, తయారీ ఉత్పత్తులపై సుంకాల పెంపునకు కేంద్రం పూనుకుంటోంది. గతంలో వ్యవసాయేతర ఉత్పత్తులపై అత్యధికంగా 1991-92లో 150 శాతం ఉన్న కస్టమ్స్‌ డ్యూటీని 40 శాతానికి, 1997-98లో 20 శాతానికి, 2007-08లో పది శాతానికి తగ్గించారు.

అయితే ఈ విధానానికి స్వస్తిపలికి కస్టమ్స్‌ సుంకాల పెంపునకు మోదీ సర్కార్‌ పూనుకుంది. అయితే ఇవి ఎంతమాత్రం రక్షణాత్మక చర్యలు కాదని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంటోంది. అయితే యపిల్స్‌, బాదం నుంచి 29 అమెరికన్‌ ఉత్పత్తులపై పెంచిన కస్టమ్స్‌ సుంకాలు ఈనెల 4 నుంచి అమల్లోకి వచ్చిన క్రమంలో ఇవి డబ్ల్యూటీవో నిర్ధేశించిన రేట్ల కంటే అధికంగా ఉన్నాయని విశ్లేషకులు హెచ్చరించారు. పన్ను టారిఫ్‌ పెంపుపై అటు పరిశ్రమ నుంచి, ప్రభుత్వ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనా ప్రభుత్వం కస్టమ్స్‌ సుంకాల పెంపుకే మొగ్గుచూపింది.

మరిన్ని వార్తలు