ఆస్ట్రేలియా గ్రూప్‌లో భారత్‌కు చోటు

20 Jan, 2018 00:57 IST|Sakshi

న్యూఢిల్లీ: క్షిపణి సాంకేతికత నియంత్రణ కూటమి (ఎంటీసీఆర్‌), వాసెనార్‌ గ్రూప్‌లలో స్థానం దక్కించుకున్న భారత్‌కు శుక్రవారం జీవ, రసాయనిక ఆయుధాల నియంత్రణ సంస్థ అయిన ఆస్ట్రేలియా గ్రూప్‌లోనూ చోటు దక్కింది. జీవ, రసాయనిక ఆయుధాలను అభివృద్ధి చేసుకోకుండా.. వీటి తయారీకి అవసరమైన పరికరాలు, ముడిపధార్థాలు, సాంకేతిక వ్యాప్తిని వ్యతిరేకించే దేశాలను సమన్వయం చేసే, సామరస్యపూర్వక ఎగుమతుల నియంత్రణను పర్యవేక్షించే స్వచ్ఛంద సంస్థగా ఆస్ట్రేలియా గ్రూప్‌ (ఏజీ) పనిచేస్తోంది.

అణ్వాయుధ నిరాయుధీకరణ లక్ష్యాలను చేరుకోవటం, అంతర్జాతీయ భద్రతలో ఈ సభ్యత్వం పరస్పర ప్రయోజనకారిగా ఉంటుందని భారత విదేశాంగ ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఏజీలో సభ్యత్వం భారత విశ్వసనీయత మరింత పెరిగేందుకు దోహదపడుతుందన్నారు. 2016లో ఎంటీసీఆర్‌లో, గతేడాది వాసెనార్‌ గ్రూప్‌లో భారత్‌ సభ్యత్వం పొందిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు