ఉక్కు ఉత్పత్తిలో భారత్‌ అరుదైన ఘనత

30 Jan, 2019 10:02 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉక్కు ఉత్పాదనలో భారత్‌ అరుదైన ఘనత సాధించింది. ముడి స్టీల్‌ తయారీలో జపాన్‌ను పక్కకునెట్టిన భారత్‌ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిని చేపట్టే దేశంగా అవతరించిందని వరల్డ్‌ స్టీల్‌ అసోసియేషన్‌ తాజా నివేదిక వెల్లడించింది. 2018లో భారత్‌లో ముడి ఉక్కు ఉత్పత్తి 4.9 శాతం పెరిగి 106.5 మెట్రిక్‌ టన్నులకు చేరుకుంది. ఇది అంతకుముందు ఏడాది 101.5 మెట్రిక్‌ టన్నులుగా నమోదైంది.

ఇదే సమయంలో 2018లో జపాన్‌ ముడి ఉక్కు ఉత్పత్తి అంతకుముందు ఏడాదితో పోలిస్తే 0.3 శాతం పతనమై 104.3 మెట్రిక్‌ టన్నులకు తగ్గింది. స్టీల్‌ ఉత్పత్తిలో చైనా టాప్‌ పొజిషన్‌లో కొనసాగుతోంది. 2018లో చైనాలో స్టీల్‌ ఉత్పత్తి అంతకుముందు ఏడాదితో పోలిస్తే 6.6 శాతం పెరిగి 928.3 మెట్రిక్‌ టన్నులకు ఎగబాకింది.

ప్రపంచ ముడి ఉక్కు ఉత్పత్తిలో చైనా వాటా 2017లో 50.3 నుంచి  51.3 శాతానికి పెరిగిందని వరల్డ్‌ స్టీల్‌ అసోసియేషన్‌ నివేదిక తెలిపింది. 2018లో 86.7 మెట్రిక్‌ టన్నుల ముడి ఉక్కును తయారుచేసిన అమెరికా ఈ జాబితాలో 4వ స్ధానంలో నిలిచింది. ఇక టాప్‌ టెన్‌ జాబితాలో వరుసగా దక్షిణ కొరియా, రష్యా, జర్మనీ, టర్కీ, బ్రెజిల్‌, ఇరాన్‌లకు చోటుదక్కింది.

మరిన్ని వార్తలు