చైనాతో ఘర్షణ: 20 మంది భారత జవాన్ల వీరమరణం!

16 Jun, 2020 22:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఇండియా - చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి కల్నల్ సంతోష్‌తో పాటు మరో ఇద్దరు జవాన్లు చనిపోయినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే 20 మంది భారత జవాన్లు చనిపోయారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

మరోవైపు భారత్-చైనా బలగాల ఘర్షణలో 10 మంది భారత సైనికులు మృతి చెందినట్లు ప్రముఖ జాతీయ మీడియా సంస్థ పీటీఐ పేర్కొంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అటు చైనా వైపు కూడా పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. 43 మంది చైనా సైనికులు చనిపోయినట్లు సమాచారం. అయితే  చైనా మాత్రం మరణాలపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. 
(చదవండి : ప్రధానితో విదేశాంగ మంత్రి భేటీ)

లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద సరిహద్దుల్లో  భారత్‌, చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో భారత సైన్యానికి చెందిన ఓ కల్నల్‌ స్థాయి అధికారితో పాటు ఇద్దరు సైనికులు మృతి చెందినట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. సోమవారం రాత్రి జరిగిన ఇరుదేశాల సైనికుల ఘర్షణలో సూర్యాపేటకు చెందిన సంతోష్ బాబు అమరుడయ్యారు.
చదవండి : 
చైనాతో ఘర్షణ: తెలంగాణ ఆర్మీ అధికారి మృతి

సంతోష్‌ ప్రాణత్యాగం వెలకట్టలేనిది : కేసీఆర్

నా ఒక్కగానొక్క కొడుకు: సంతోష్‌ తల్లి‌​​​​​​​​​​​​​​

>
మరిన్ని వార్తలు