ఎలాంటి హానీ తలపెట్టకుండా పైలట్‌ను విడిచిపెట్టాలి : భారత్‌ 

27 Feb, 2019 20:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్‌కు పట్టుబడ్డ భారత పైలట్‌ అభినందన్‌ను సురక్షితంగా అప్పగించాలని భారత ప్రభుత్వం డిమాండ్‌ చేసింది. తమ పైలట్‌కు ఎలాంటి హాని తలపెట్టకుండా అప్పగించే బాధ్యత పాకిస్తాన్‌ ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. పైలట్‌ అభినందన్‌ను హింసించడం అమానుషమని పేర్కొంది. తీవ్రంగా గాయపడ్డ పైలట్‌ను చూపడం జెనీవా ఒప్పందానికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్త చేసింది. ఇప్పటికే పలుమార్లు ఉగ్ర క్యాంపుల గురించి పాకిస్తాన్‌కు సమాచారమిచ్చామని, పాక్‌ చర్యలు తీసుకోనందునే దాడి చేశామని పేర్కొంది. తాము  ఉగ్రవాదులపై దాడి చేశామే తప్ప పాక్‌ ప్రజలపై కాదని స్పష్టం చేసింది. (భారత పైలట్‌కు పాక్‌ చిత్రహింసలు!) 

బుధవారం ఉదయం పాక్‌ విమానాలు భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చాయి. వాటిని తిప్పి కొట్టే క్రమంలో భారత పైలట్‌ అభినందన్‌ పాక్‌ సైన్యానికి చిక్కారు. ఈ విషయాన్ని దృవీకరిస్తూ పాక్‌ ఓ విడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో స్థానికులు అభినందన్‌పై దాడి చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. భారత పైలట్‌ పట్ల పాకిస్తాన్‌ వ్యవహరించిన తీరును భారత ప్రభుత్వం తప్పుపట్టింది. యుద్దంలో చిక్కిన సైనికునిపై దాడి చేసి పాక్‌ జెనీవా ఒప్పందాన్ని ఉల్లఘించిదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా బుధవారం సాయంత్రం అభినందన్‌కు సంబంధించి మరో వీడియోను పాక్‌ విడుదల చేసింది. వీడియోలో అభినందన్‌ కాఫీ తాగుతూ క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా పాకిస్తాన్‌ జవాన్ల ట్రీట్మెంట్‌ బాగుందని అభినందన్‌ తెలిపారు. తనపై స్థానికులు దాడి చేస్తే పాకిస్తాన్‌ సైన్యమే కాపాడిందని చేప్పారు. (ఎవరీ విక్రమ్ అభినందన్‌?)

ఇది చదవండి : భారత పైలెట్‌ అభినందన్‌ క్షేమం!

మరిన్ని వార్తలు