కరోనా మరణాలు 2,752

17 May, 2020 04:58 IST|Sakshi

కొత్తగా 3,970 కేసులు నమోదు

న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. శుక్రవారం నుంచి శనివారం వరకు.. 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,970 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 103 మంది కరోనా కాటుతో కన్నుమూశారు. దీంతో దేశంలో ఇప్పటిదాకా పాజిటివ్‌ కేసులు 85,940కి, మరణాలు 2,752కి ఎగబాకాయని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది. ప్రస్తుతం యాక్టివ్‌ కరోనా కేసులు 53,035 కాగా, 30,152 మంది బాధితులు చికిత్సతో పూర్తిగా కోలుకున్నారు. 35.08 శాతం మంది కరోనా కోరల నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్రను కరోనా భూతం పట్టిపీడిస్తోంది. ఇక్కడ గత 24 గంటల్లో 49 మంది మరణించారు. గుజరాత్‌లో 20 మంది, పశ్చిమ బెంగాల్‌లో 10 మంది, ఢిల్లీలో 8, ఉత్తరప్రదేశ్‌లో ఏడుగురు, తమిళనాడులో ఐదుగురు మృత్యువాత పడ్డారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం కరోనా మరణాలు 2,752 కాగా, ఇందులో 1,068 మరణాలు మహారాష్ట్రలోనే సంభవించడం గమనార్హం.

మరిన్ని వార్తలు