భారత్‌: కోటి దాటిన కరోనా పరీక్షలు..

6 Jul, 2020 16:39 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత్‌లో కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు సంఖ్య పెరుగుతుండటంతో కరోనా పరీక్షల సామర్థ్యం భారీగా పెరిగింది. ఇప్పటి వరకు దేశంలో కోటి కరోనా నిర్ధారణ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్(ఐసీఎంఆర్‌)‌ సోమవారం వెల్లడించింది. ఆ రోజు ఉదయం 11 గంటల వరకు భారత్‌లో మొత్తం 1,00,04,101 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్‌ మీడియా కోఆర్డినేటర్‌ డాక్టర్‌ లోకేష్‌ శర్మ పేర్కొన్నారు. అలాగే ఆదివారం ఒక్కరోజు 1,80,596 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. 24,248 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు వెల్ల‌డించారు. రోజుకు 2 ల‌క్ష‌ల 15 వేల 655 శాంపిల్స్ చొప్పున పరీక్షించిన‌ట్లు, గ‌డిచిన అయిదు రోజుల్లో ప‌ది ల‌క్ష‌ల టెస్టులు చేసిన‌ట్లు ఆయన తెలిపారు. (ర‌ష్యాను వెన‌క్కు నె‌ట్టేసిన‌ భార‌త్‌)

దేశంలో మొత్తం కరోనా నిర్ధారణ పరీక్షల కోసం 1100 ల్యాబ్‌లకు ఐసీఎంఆర్‌ అనుమతినిచ్చింది. వీటిలో 788 ప్రభుత్వ ల్యాబులు ఉండగా, 317 ప్రైవేటు ల్యాబులు ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 61, తెలంగాణలో 36 కేంద్రాల్లో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. కాగా దేశ వ్యాప్తంగా అత్యధికంగా కరోనా టెస్టులు నిర్వహించిన రాష్ట్రాల్లో త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్ర‌, రాజ‌స్థాన్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్, క‌ర్ణాట‌క‌ మొదటి అయిదు స్థానాల్లో ఉన్నాయి. ఇక క‌రోనా పాజిటివ్ కేసుల్లో భార‌త్ ప్ర‌పంచంలోనే మూడు స్థానానికి చేరుకున్న విషయం తెలిసిందే. అమెరికా, బ్రెజిల్ మాత్ర‌మే భార‌త్ కంటే ముందున్నాయి. (ఏపీలో కొత్తగా 1,322 కరోనా కేసులు)

మరిన్ని వార్తలు