భారత్.. జర్నలిస్టులకు వెరీ డేంజరస్.!

15 May, 2016 10:50 IST|Sakshi
భారత్.. జర్నలిస్టులకు వెరీ డేంజరస్.!

న్యూఢిల్లీ: మీడియా వ్యక్తులకు భారత్ ప్రమాదకరదేశమట. అంతేకాదు జర్నలిస్టులకు రక్షణ కరువైన దేశాల్లో ప్రపంచంలోనే భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఈ విషయం 2015లో జరిపిన ఓ అంతర్జాతీయ సర్వేలో వెల్లడైంది. పాత్రికేయులకు హాని ఉన్న దేశాల జాబితా రూపొందించడానికి చేసిన సర్వేలో ఇరాక్, సిరియా తొలి రెండు స్థానాల్లో నిలవగా... అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ మూడో స్థానంలో ఉంది. అంతర్జాతీయ సంస్థ చేసిన సర్వే వివరాలను కొట్టిపారేయడానికి ఆస్కారం లేదని మనం గమనించాలి. అందుకు తాజాగా జరిగిన జర్నలిస్టుల హత్యలే ఇందుకు ఉదాహరణ.

పక్క పక్క రాష్ట్రాలైన బిహార్‌, జార్ఖండ్‌లలో కేవలం 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు జర్నలిస్టులు దారుణహత్యకు గురయ్యారు. సీనియర్ పాత్రికేయుడు రాజ్‌దేవ్ రంజన్‌ను ఈ శుక్రవారం సాయంత్రం బిహార్‌లోని సివాన్‌ జిల్లాలో గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. రాజ్‌దేవ్‌ హిందీ దినపత్రిక 'హిందూస్తాన్‌'లో బ్యూరో చీఫ్‌ గా 20 ఏళ్లుగా విధులు నిర్వర్తించారు. సివాన్ రైల్వేస్టేషన్‌ వద్ద అతి సమీపం నుంచి ఆయనపై కాల్పులు జరిపి పొట్టన పెట్టుకున్నారు. జార్ఖండ్‌లోని చాత్రా జిల్లాలో 35 ఏళ్ల అఖిలేశ్‌ అనే జర్నలిస్టును గురువారం రాత్రి అతి దారుణంగా కాల్చిచంపారు.

1992 నుంచి భారత్ లో అధికారికంగా ఇప్పటివరకూ 64 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారని సర్వేలో వెల్లడైంది. ఇందులో చాలా మంది చిన్న చిన్న గ్రామాలు, టౌన్ ప్రాంతాల్లో తమ సమస్యలపై కథనాలు రాసిన వారు ఉన్నారు. స్థానిక రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల వల్ల హత్యకు గురవుతున్నారని ఎన్నో ఆరోపణలున్నాయి. జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు, దాడులు జరిగిన తక్షణమే నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్త పాలసీలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ చంద్రమౌళి కుమార్ విజ్ఞప్తిచేశారు.

మరిన్ని వార్తలు