పాక్‌ ప్రధాని లేఖపై స్పందించిన కేంద్రం

20 Sep, 2018 16:44 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, భారత ప్రధానమంత్రి నరేంద​ మోదీకి రాసిన లేఖపై భారత ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇరుదేశాల విదేశాంగ మంత్రుల మధ్య సమావేశం జరగాలన్న పాక్‌ ప్రధాని లేఖ నేపథ్యంలో  సమావేశానికి సిద్ధమని  విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

పాకిస్తాన్‌  ప్రధాని నుంచి  వచ్చిన శాంతి చర్చల ప్రతిపాదనను ధృవీకరించిన  విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రావీష్‌ కు​మార్‌   గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ నెలాఖరుకు నాటికి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ (యుఎన్‌జీఏ) న్యూయార్క్‌లో భారత, పాకిస్థాన్ విదేశాంగ మంత్రులు సమావేశం కానున్నారని  తెలిపారు. ఇది కేవలం సమావేశం మాత్రమే.. చర్చల ప్రక్రియ మొదలుపెట్టినట్లు కాదని రావీష్‌కుమార్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో  ఏం చర్చించాలనేది ఇంకా  నిర్ణయించ లేదని చెప్పారు. అయితే పరస్పర అనుకూలమైన తేదీ , సమయములో ఈ సమావేశం  జరుగుతుందని వివరించారు.

గత నెలలో ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది మొదటి అధికారిక ప్రతిపాదన కావడం విశేషం. రెండు దేశాలు అంగీకరిస్తే యూఎన్ సమావేశంతో పాటు విదేశాంగ మంత్రుల సమావేశాన్ని కోరారు. ఈ నెలలో జరగనున్న ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వీరిద్దరూ భేటీ కావాలని ఆయన ఆకాంక్షించారు, తీవ్రవాదం, రెండు దేశాల మధ్య శాంతి తదితర అంశాలపై చర్చించేందుకు పాకిస్తాన్ సిద్ధమని పాక్‌ ప్రధాని ఆ లేఖలో పేర్కొన్నారు.

కాగా భారత్‌, పాక్ మధ్య నిర్మాణాత్మక సంబంధాల కోసం భారత్ ఎదురు చూస్తోందని ప్రధాని మోదీ ఆగస్ట్ 20న లేఖ రాసిన సంగతి తెలిసిందే. భారత్ పొరుగు దేశంతో శాంతియుత సంబంధాలకు కట్టుబడి ఉందని మోదీ అందులో ప్రస్తావించారు.

మరిన్ని వార్తలు