8 రోజుల్లో లక్ష కేసులు

22 Jun, 2020 05:25 IST|Sakshi

భారత్‌లో విజృంభిస్తున్న కరోనా వైరస్‌

దేశంలో 4 లక్షలు దాటిన కేసులు

ఒకే రోజు 15 వేలకు పైగా కేసులు నమోదు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకీ కోవిడ్‌–19 కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కేవలం ఒక్క రోజే 15,413 కరోనా  కేసులు నమోదు కావడంతో మొత్తం కేసులు 4,10,461కి చేరుకున్నాయి. 24 గంటల్లో 306 మంది ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 13,254కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం వెల్లడించింది. నాలుగైదు రోజులుగా రోజుకి 12 వేలకు పైగా కేసులు నమోదవుతూ ఉండడంతో కేసుల సంఖ్య నాలుగు లక్షలు దాటేసింది.

3 నుంచి 4 లక్షలకు కేసులు చేరుకోవడానికి కేవలం ఎనిమిది రోజులు మాత్రమే పట్టింది. దేశంలో తొలి కేసు నమోదైన దగ్గర్నుంచి 143 రోజుల్లో 4 లక్షల కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 75% కేసులు  గత నెలరోజుల్లోనే అంటే, మే 19 నుంచి జూన్‌ 20 మధ్య నమోదయ్యాయి. రికవరీ రేటు ఒక్కటే భారత్‌కు భారీగా ఊరటనిస్తోంది. ఇప్పటికే 2.27 లక్షల మంది రోగులు కోలుకున్నారు. రికవరీ రేటు 55.48శాతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కేసుల్లో భారత్‌ నాలుగోస్థానంలో ఉంటే, మృతుల్లో ఎనిమిదో స్థానంలో ఉంది.

కేసులు పెరిగింది ఇలా..
భారత్‌లో తొలి కరోనా కేసు జనవరి 30న మొదలైన దగ్గర్నుంచి వంద కేసులు చేరుకోవడానికి 43 రోజులు పడితే వంద కేసుల నుంచి లక్ష చేరుకోవడానికి 64 రోజులు పట్టింది. అప్పట్నుంచి కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. మరో లక్ష కేసులు 15 రోజుల్లోనే నమోదైతే, 3 లక్షలు చేరుకోవడానికి ఇంకో 10 రోజులే పట్టింది. 3 నుంచి 4 లక్షలు కేవలం ఎనిమిది రోజుల్లోనే దాటేసింది.

మూడు రాష్ట్రాల నుంచే 60% కేసులు
దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 60శాతం కేసులు మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ నుంచే వస్తున్నాయి. ఈ మూడు రాష్ట్రాలు కరోనా గుప్పిట్లో చిక్కుకొని అల్లాడిపోతున్నాయి. మహారాష్ట్రలో లక్షా 28 వేల 205 కేసులు నమోదైతే ఆ తర్వాత స్థానాల్లో తమిళనాడు (56,845), ఢిల్లీ (56,746), గుజరాత్‌ (26,680), ఉత్తరప్రదేశ్‌ (16,594) రాష్ట్రాలున్నాయి. ఇక దేశవ్యాప్తంగా సంభవించిన 13,254  కోవిడ్‌ మృతుల్లో మహారాష్ట్రలో అత్యధికంగా 5,984 నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానంలో ఢిల్లీ (2,112), గుజరాత్‌ (1,638), తమిళనాడు (704) ఉన్నాయి.

జూలై 1కి 6 లక్షల కేసులు ?
భారత్‌లో మరో పది రోజుల్లోనే 2 లక్షల కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 6 లక్షలు దాటేస్తుందని అమెరికాకు చెందిన మిషిగాన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ అంచనా వేశారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి భారత్‌ ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా వ్యవహరించడం లేదని భారత సంతతికి చెందిన మిషిగాన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ భ్రమర్‌ ముఖర్జీ తెలిపారు. భారత్‌లో మరిన్ని కోవిడ్‌–19 వైద్య పరీక్షలు జరగాల్సిన అవసరం ఉందన్నారు.  ‘‘భారత్‌ జనాభాలో 0.5 శాతానికే పరీక్షలు నిర్వహించారు. అదే మిగిలిన ప్రపంచ దేశాలు కరోనా విస్తృతి అధికంగా చేరుకున్న నాటికి జనాభాలో 4 శాతం మందికి పరీక్షలు నిర్వహించారు. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత నాలుగైదు వారాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతా యి. భారత్‌లో కూడా అదే జరుగుతోంది. జూలై 1 నాటికి కేసులు 6 లక్షలు దాటొచ్చు’ అని ఆమె అంచనా వేశారు.

మరిన్ని వార్తలు