‘చైనా హెలికాప్టర్‌ చొరబాటుకు యత్నించింది’

20 May, 2020 09:23 IST|Sakshi

ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటాం: ఎయిర్‌ స్టాఫ్‌ చీఫ్‌

న్యూఢిల్లీ: లఢక్‌లోకి చైనా మిలిటరీ హెలికాప్టర్ల చొరబాటు యత్నాల నేపథ్యంలో తాము అన్నివిధాల అప్రమత్తంగా ఉన్నట్లు భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) తెలిపింది. ఈశాన్య లఢక్‌లోని పాటు గాల్వాన్‌ ప్రాంతంలో భారత, చైనా దళాలు అనేకమార్లు ముఖాముఖి ఎదురుపడతాయని.. ఈ క్రమంలో వారి మధ్య కొన్నిసార్లు ఘర్షణలు చోటుచేసుకుంటాయని పేర్కొంది. ఈ మేరకు.. ఎయిర్‌ స్టాఫ్‌ చీఫ్‌, ఎయిర్‌ మార్షల్‌ ఆర్కేఎస్‌ భదూరియా ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘చైనీస్‌ హెలికాప్టర్‌ లఢక్‌లో చొరబడటానికి తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఇందుకు ప్రతిగా దానిని నిలువరించేందుకు మేం ఓ ఎయిర్‌క్రాఫ్ట్‌ను అక్కడ మోహరించాం. అంతేతప్ప అక్కడ పెద్దగా ఏమీ జరగలేదు. ఎల్లవేళలా మేం అప్రమత్తంగా ఉంటాం. మాకు తెలియకుండా అక్కడ ఏమీ జరుగదు’’ అని పేర్కొన్నారు.(కాలాపానీ మాదే.. భారత్‌ నుంచి తీసుకుంటాం)

అదే విధంగా టిబెట్‌ ప్రాంతంలో కూడా చైనా యుద్ధ విమానాల కదలిక ఉన్నట్లు తమకు ఎలాంటి సంకేతాలు వెలువడలేదని.. సరిహద్దు దాటి ముందుకు వచ్చే ప్రయత్నాలు చేసినట్లు కనిపించలేదని స్పష్టం చేశారు. కాగా తూర్పు లఢక్‌లోని ప్యాంగ్యాంగ్‌ సరస్సు తీరం వెంబడి భారత్, చైనా దళాలకు చెందిన దాదాపు 200 మంది ఘర్షణకు దిగి.. పరస్పరం రాళ్లు విసురుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లఢక్‌లోకి చైనా సైన్యం హెలికాప్టర్లు చొరబడ్డాయి.(భారత్‌పై నేపాల్‌‌ అభ్యంతరం.. చైనా ప్రమేయం!)

ఇక ఈ విషయంపై స్పందించిన చైనా సరిహద్దు వద్ద తమ సైన్యం ఎంతో సంయమనంతో, శాంతియుతంగా వ్యవహరిస్తోందని తెలిపింది. ఇరు దేశాల మధ్య పరిస్థితులు మరింత సంక్లిష్టయ్యేలా భారత్‌ ఎటువంటి చర్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వ అధికార మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ మంగళవారం ఓ కథనం ప్రచురించింది. ‘‘చైనా భూభాగంలోని గల్వాన్‌ ప్రాంతంలో భారత్‌ ఇటీవల రక్షణ దళాల అవసరాల నిమిత్తం చేపట్టిన అక్రమ నిర్మాణమే.. చైనా బలగాలు వారికి సమాధామిచ్చేలా చేసింది. భారత అక్రమ చొరబాట్లను అడ్డుకునేందుకే చైనా సైన్యం ధీటుగా బదులిచ్చింది’’అంటూ భారత్‌పై తన ఆక్రోషం వెళ్లగక్కింది. 

మరిన్ని వార్తలు