వాయుసేన విమానం గల్లంతు.. ముమ్మరంగా గాలింపు 

4 Jun, 2019 10:41 IST|Sakshi

ఈటానగర్ : 13 మందితో బయలుదేరిన భారత వాయుసేన (ఐఏఎఫ్‌)కు చెందిన ఏఎన్‌32 రకం విమానం ఆచూకీ ఇంకా లభించలేదు. అస్సాం లోని జొర్హాత్‌ నుంచి సోమవారం మధ్యాహ్నం 12.27 గంటలకు బయలుదేరిన ఈ విమానం అరుణాచల్‌ప్రదేశ్‌లోని మెంచుకాకు (చైనా సరిహద్దుకు దగ్గర్లో) చేరాల్సి ఉండగా, మార్గమధ్యంలోనే కనిపించకుండా పోయింది. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత విమానం ఆచూకీ లభించలేదని, ఆర్మీ అధికారులు తెలిపారు. తప్పిపోయిన విమానాన్ని గుర్తించేందుకు ఆర్మీతోపాటు అన్ని ప్రభుత్వ విభాగాలు, శాఖలతో సమన్వయంతో గాలింపుచర్యలు చేపట్టినా మంగళవారం ఉదయం వరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు.

విమానంలో 8 మంది సిబ్బంది, ఐదుగురు ప్రయాణికులు కలిపి మొత్తం 13 మంది ఉన్నారు. 2009 జూన్‌ నెలలో కూడా సరిగ్గా ఇలాంటి ఘటనే అరుణాచల్‌లో జరిగింది. ఏఎన్‌–32 రకం విమానం 13 మందిని ఎక్కించుకుని వెళ్తుండగా అరుణాచల్‌ ప్రదేశ్‌లోనే కూలిపోయింది. అందులోని మొత్తం 13 మంది మరణించారు. పశ్చిమ సియాంగ్‌ జిల్లాలోని రించీ హిల్‌పైన ఆ విమానం కూలిపోయింది.

మరిన్ని వార్తలు