ఆ 89 యాప్స్‌ తొలగించండి 

9 Jul, 2020 06:43 IST|Sakshi

తన సిబ్బంది, ఆధికారులకు భారత ఆర్మీ ఆదేశం

న్యూఢిల్లీ:  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్రూకాలర్‌ సహా మొత్తం 89 యాప్‌లను జులై 15లోగా తమ స్మార్ట్‌ ఫోన్‌లలో నుంచి తొలగించాలని తమ సిబ్బంది, అధికారులను బుధవారం ఆర్మీ ఆదేశించింది. ఆ యాప్‌లతో కీలకమైన సెక్యూరిటీ సమాచారం లీక్‌ అయ్యే ప్రమాదముందని పేర్కొంది. ఈ ఆదేశాలను పాటించని వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. ఈ 89 యాప్స్‌లో 59 యాప్స్‌ చైనాకు సంబంధించినవే కావడం గమనార్హం. వాటిలో ఇటీవల కేంద్రం నిషేధించిన టిక్‌టాక్‌ కూడా ఉంది. పాకిస్తాన్, చైనాల ఇంటలిజెన్స్‌ వర్గాలు భారత సైనికులను లక్ష్యంగా చేసుకునే ముప్పు ఇటీవల చాలా పెరిగిందని భారత సైన్యాధికారి ఒకరు పేర్కొన్నారు.

అధికారిక సమాచార మార్పిడికి వాట్సాప్‌ను వాడకూడదంటూ గత నవంబర్‌లోనే ఆర్మీ తమ సిబ్బందిని ఆదేశించింది. కీలక హోదాల్లో ఉన్న సైన్యాధికారులు ఫేస్‌బుక్‌ను వాడవద్దని కూడా అప్పుడే సూచించింది. గత రెండు, మూడేళ్లుగా పాక్‌ ఏజెంట్లు భారత త్రివిధ దళాల సైనికులు లక్ష్యంగా, కీలక రక్షణరంగ సమాచారం సేకరించేందుకు అమ్మాయిలను ఎరగా వేసి హానీట్రాప్‌లకు పాల్పడిన విషయం తెలిసిందే. ఫేస్‌బుక్‌ను వినియోగించవద్దని నౌకాదళం కూడా ఇప్పటికే తమ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది.   

మరిన్ని వార్తలు