పాక్‌ సైనికుల కుట్రను భగ్నం చేసిన ఆర్మీ

31 Dec, 2018 13:21 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

శ్రీనగర్‌ : సరిహద్దు వెంబడి గస్తీ కాసే భారత ఆర్మీ పోస్టుపై దాడి చేసేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్‌ సరిహద్దు సాయుధ బలగాల కుట్రను భగ్నం చేసినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు పాకిస్తానీ సైనికులు మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఈ విషయం గురించి ఆర్మీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ... నియంత్రణ రేఖ వెంబడి నవోగామ్‌ సెక్టార్‌ వద్ద మోర్టార్లు, రాకెట్లతో పాక్‌ సైనికులకు దాడులకు పాల్పడ్డారని తెలిపారు. ఈ చర్యలతో అప్రమత్తమైన భారత సైన్యం ఎదురుదాడి చేయడంతో వారు తప్పించుకున్నారన్నారు.

ఈ క్రమంలో పాక్‌ అధికారులు వదిలివేసిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని, ఇవన్నీ గమనిస్తుంటే భారీ స్థాయిలోనే కుట్రకు ప్రణాళిక రచించినట్లు అర్థమవుతోందన్నారు. నూతన సంవత్సరం వేడుకల్లో మునిగి ఉన్న వేళ భారత సైనికులను మట్టుబెట్టి, దేశంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. ఇటువంటి సమయంలో చాకచక్యంగా వ్యవహరించి కుట్రను తిప్పికొట్టిన భారత సైనికుల ధీరత్వాన్ని ప్రశంసించారు. తమ సైనికుల మృతదేహాలను స్వాధీనం చేసుకోవాల్సిందిగా పాక్‌ ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు