మరోసారి సర్జికల్‌ స్ట్రైక్స్‌.. ఈసారి టార్గెట్‌ నాగా టెర్రర్‌!

27 Sep, 2017 18:30 IST|Sakshi
మయన్మార్‌ సరిహద్దుల్లో భారత ఆర్మీ మెరుపుదాడులు.. ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ: భారత సైన్యం మరోసారి సర్జికల్‌ స్ట్రైక్స్‌తో ఉగ్రవాదులపై విరుచుకుపడింది. నాగా ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఇండో- మయన్మార్‌ సరిహద్దుల్లో మెరుపుదాడులు చేసింది. ఇండియన్‌ ఆర్మీకి చెందిన 70మంది పారా కమాండోల బృందం ఉదయం నాలుగు గంటల 45 నిమిషాలకు ఈ దాడి నిర్వహించింది. లాంఖూ గ్రామ సమీపంలో ఉన్న నాగా టెర్రర్‌ క్యాంప్స్‌ను ధ్వంసంచేసింది. ఈ మెరుపుదాడుల్లో ఎన్‌ఎస్‌సీఎన్‌-కే ఉగ్రమూకకు భారీ నష్టం వాటిల్లినట్టు సైన్యం ప్రకటించింది. పెద్దసంఖ్యలో ఉగ్రవాదులు చనిపోయినట్టు చెప్పింది. అయితే, సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిపిన కమాండోలు అంతర్జాతీయ సరిహద్దు దాటలేదని స్పష్టంచేసింది. మన కమాండోలకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపింది. జవాన్లపై నాగాలు దాడికి దిగడంతో.. వారిని నిలువరించే క్రమంలోనే మెరుపుదాడులు చేసినట్టు సైనికవర్గాలు వెల్లడించాయి.

ఎస్‌ఎస్‌ ఖప్లాంగ్‌ నేతృత్వంలో ఏర్పడిన ఎన్‌ఎస్‌సీఎన్‌-కే తిరుగుబాటుదళం.. నాగాల్యాండ్‌, మణిపూర్‌ల్లో మన జవాన్లపై వరుస దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో.. సైన్యం సర్జికల్‌ స్ట్రైక్స్‌తో విరుచుకుపడింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఈ తరహా మెరుపుదాడులు నిర్వహించి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో తాజాగా ఇండో మయన్మార్‌ సరిహద్దుల్లో భారత ఆర్మీ సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేయడం గమనార్హం.

మరిన్ని వార్తలు