నడి సంద్రంలో నాలుగు రోజులు, అంతా సేఫ్‌!

6 Jul, 2020 14:22 IST|Sakshi

చెన్నై: బ‌ంగాళాఖాతంలో బోటు మునిగిపోయి ప్రమాదం అంచున నిలిచిన ఆరుగురు శ్రీలంక మత్స్యకారులను ఇండియ‌న్ కోస్ట్‌ గార్డ్స్‌ ఆదివారం ఉదయం రక్షించారు. ముంబై మారీటైమ్ రెస్క్యూ కోఆర్డినేష‌న్ సెంట‌ర్ (ఎమ్మార్‌సీసీ) నుంచి అందిన సమాచారంతో చెన్నైలోని మారీటైమ్ రెస్క్యూ కోఆర్డినేష‌న్ సెంటర్‌ సిబ్బంది ఈ రెస్క్యూ ఆప‌రేష‌న్‌లో పాల్గొన్నారు. చెన్నైకి తూర్పున 170 నాటిక‌ల్ మైళ్ల దూరంలో ఈ రెస్క్యూ ఆప‌రేష‌న్ జ‌రిగింది. శ్రీలంక‌లోని త్రింకోమాళికి చెందిన ఆరుగు‌రు మత్స్యకారులు చేప‌ల వేట కోసం స‌ముంద్రంలోకి వచ్చారు. అయితే, వాతావరణం ప్రతికూలంగా మారడంతో అలల తాకిడికి వారి బోటు బోల్తాప‌డింది. దాంతో నాలుగు రోజులుగా వారు బోటుపైనే బిక్కుబిక్కుమంటూ గ‌డిపారు.

ఈ నాలుగు రోజులుగా అల‌లు ఎటు నెడితే బోటు అటే కొట్టుకుపోతూ వ‌చ్చింది. ఇదే క్రమంలో చెన్నై నుంచి విశాఖ‌ప‌ట్నం వెళ్తున్న వైఎం స‌మ్మిట్ వాణిజ్య నౌకా‌ సిబ్బందికి శ్రీలంక మత్స్యకారులు కనిపించారు. వెంటనే వైఎం స‌మ్మిట్‌ మాస్టర్‌ ఈ విషయాన్ని ముంబైలోని ఎమ్మార్‌సీసీకి అందించారు. వారు చెన్నైలోని మారీటైమ్ రెస్క్యూ కోఆర్డినేష‌న్ సెంట‌ర్ సిబ్బందిని అలర్ట్‌​ చేశారు. దాంతో చెన్నైలోని కోస్ట్‌ గార్డ్స్‌ రంగంలోకి దిగి శ్రీలంక మత్స్యకారులను ర‌క్షించారు. వాణిజ్య నౌక ద్వారా మత్స్యకారులను చెన్నైలోని నౌకా కేంద్రానికి తీసుకెళ్లారు. అనంత‌రం శ్రీలంక రాయ‌బార కార్యాలాయానికి స‌మాచారం ఇవ్వగా.. వారు మత్స్యకారులను స్వదేశానికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
(చదవండి: పబ్‌జీ ఉచ్చు: తాతా ఖాతాకు చిల్లు)

>
మరిన్ని వార్తలు