ఇక ఆఫీసులకు సెలవు, ఇంటి నుంచే పని

10 Jun, 2019 21:13 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రెండువేల సంవత్సరానికి చెందిన యువతరం ఇంటి వద్ద నుంచే ఆఫీసు పనిచేయాలని కోరుకుంటోంది. రద్దీ ట్రాఫిక్‌లో ప్రయాసపడుతూ పోయి ముక్కుతూ మూలుగుతూ పనిచేసి ఆయాసపడుతూ ఇంటికి చేరుకోవడం అర్థరహితమని వాదిస్తోంది. ఇంటి పట్టునే ఉంటూ వేలకు వేడి వేడి తేనీరు సేవిస్తూ ఎలాంటి ఆఫీసు ఇబ్బందులు లేకుండా ఆఫీసు పనిని చక్కగా చక్కబెట్టవచ్చని చెబుతోంది. ఉద్యోగాలు చూపించే పోర్టల్‌ ‘షైన్‌ డాట్‌ కామ్‌’ ఇటీవల నిర్వహించిన మూడు వంతల మంది ఈ అభిప్రాయాలను వెల్లడించారు. 22 నుంచి 30 ఏళ్ల లోపు యువత అభిప్రాయాలను సేకరించింది. వారిలో 70 శాతం మంది ఆఫీసులకు వెళ్లి ఉద్యోగాలు చేస్తోన్న వాళ్లుకాగా, పది శాతం మంది ఇంటి నుంచి పనిచేస్తున్న వాళ్లు, మిగతా వాళ్లు ఆఫీసుకు వెళ్లడంతోపాటు ఇంటి నుంచి పనిచేసే వాళ్లు ఉన్నారు. 

నాలుగు గోడల మధ్య కాకుండా స్వేచ్ఛగా పనిచేయడం ఇష్టమని 60 శాతం మంది చెప్పగా, ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పించుకోవచ్చని, సమయం ఆదా అవుతుందని, ప్రయాణ ఖర్చులు కలిసొస్తాయని ఇతరులు చెప్పారు. ఇంటి నుంచి పనిచేసుకునే వెసలుబాటు వల్ల సంస్థకు లాభం జరగడంతోపాటు ఉద్యోగి ఎక్కడికి  పోకుండా ఆ సంస్థకే విధేయుడై పనిచేసే అవకాశం ఉందని ‘షైన్‌ డాట్‌ కామ్‌’ వెల్లడించింది. ఇంటి నుంచి పనిచేయడం వల్ల సంస్థ ఉత్పత్తి బాగా పెరుగుతుందని రెండేళ్ల క్రితం స్టాండ్‌ఫోర్డ్‌ కంపెనీ నిర్వహించిన సర్వే వెల్లడించింది. ఆఫీసులకు వెళ్లి ఉద్యోగులకు మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుందని, వారు ఇంటి నుంచి పనిచేయడం వల్ల ఆ ఒత్తిడి తగ్గడమే కాకుండా పని చేయడం పట్ల సంతృప్తి కలుగుతుందని ‘హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌’ నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. 

ఎప్పుడు కాకుండా అప్పుడప్పుడయిన ఇంటి నుంచి పనిచేయడానికి తమ సంస్థ అనుమతిస్తోందని ప్రతి పది మందిలో ఏడుగురు ఉద్యోగులు తెలిపారు. వీలైతే ఆఫీసుకు లేదంటే ఇంట్లో కూర్చొని పనిచేసుకోవడానికి అవకాశాలు ఉండాలని మూడొంతుల మంది అభిప్రాయగా కచ్చితంగా ఇంటి నుంచి పనిచేసుకునేందుకే నూటికి నూరు శాతం అవకాశం ఉండాలన్న వారు కేవలం ఆరు శాతం. అప్పుడే తమ కర్తవ్యాన్ని తాము పరిపూర్ణం చేయగలగమని అన్నారు. ఇంటి నుంచి పనిచేయడంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయని సర్వేలో కొంత మంది అభిప్రాయపడ్డారు. తమ ఆఫీసు పనికి ఏ సమయంలో, ఎప్పుడు ఫుల్‌స్టాప్‌ పెట్టాలో తెలియక ఆందోళనకు గురయ్యే అవకాశం ఉందని వారన్నారు. 

మరిన్ని వార్తలు