క‌రోనాను అడ్డుకునే అత్య‌వ‌స‌రాలు రైల్వే స్టేష‌న్‌లో ల‌భ్యం

25 Jun, 2020 17:43 IST|Sakshi

న్యూఢిల్లీ: క‌రోనా వైపరీత్యం వ‌ల్ల ముఖానికి మాస్కు, చేతికి గ్ల‌వుజులు, బ్యాగులో శానిటైజ‌ర్ త‌ప్ప‌నిస‌రిగా మారిన విష‌యం తెలిసిందే. పొర‌పాటున అవి లేకుండా బ‌య‌ట‌కు వ‌స్తే అందుకు మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దు. దీనిని నివారించేందుకు రైల్వే శాఖ కొత్త‌ నిర్ణ‌యం తీసుకుంది. రైల్వే ప్లాట్‌ఫామ్స్‌పై ఉండే స్టాల్స్‌లో క‌రోనా వ్యాప్తి నివార‌ణా వ‌స్తువుల‌ను అమ్మాల‌ని నిర్ణ‌యించింది. దీంతో రైల్వే స్టేష‌న్ల‌‌లో ఉండే దుకాణ‌దారులు పుస్త‌కాలు, మందులు, తినుబండారాల‌తోపాటు ఇక నుంచి కోవిడ్‌ను అడ్డుకునే అత్య‌వ‌స‌రాల‌ను కూడా అమ్మ‌నున్నారు. ప్ర‌యాణికులు మాస్కులు వంటివి ఇంట్లోనే మ‌ర్చిపోయిన‌ప్పుడు స్టేష‌న్‌లో కొనుక్కొని జాగ్ర‌త్త‌లు ప‌డే వీలుంటుంద‌ని తెలిపింది. (బ్రేక్‌డౌన్‌ కాదు.. లాక్‌డౌన్‌ !)

రైళ్ల‌లో ప్ర‌యాణికుల భ‌ద్ర‌త దృష్ట్యా, క‌రోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు రైల్వే శాఖ వెల్ల‌డించింది. అయితే ఎమ్మార్పీ ధ‌ర‌కు మాత్ర‌మే వాటిని అమ్మాల్సి ఉంటుంద‌ని,  ఒక్క పైసా కూడా అధికంగా వ‌సూలు చేసేందుకు వీలు లేద‌ని దుకాణ‌దారుల‌ను హెచ్చ‌రించింది. ఇక వీటితోపాటు బెడ్‌రోల్ కిట్ కూడా అందుబాటులో ఉంచ‌నున్న‌ట్లు తెలిపింది. ఇందులో ఒక దిండు, దిండు క‌వ‌ర్‌, దుప్ప‌టి, ఫేస్ ట‌వ‌ల్ ఉంటాయి. ఇవ‌న్నీ కూడా త‌ప్ప‌నిస‌రిగా నాణ్య‌త‌తో ఉండాల‌ని రైల్వే శాఖ‌ స్ప‌ష్టం చేసింది. కాగా ఏసీ బోగీల్లో ప్రయాణించే వారికి భార‌తీయ రైల్వే శాఖ‌ సాధారణంగా దుప్పట్లు, కర్టన్లు వంటివి ఏర్పాటు చేస్తుంది. కానీ వైర‌స్ కార‌ణంగా ఆ సౌక‌ర్యాన్ని ఎత్తివేసిన విష‌యం తెలిసిందే. (వలస కష్టం కాటేసింది పసివాడిని వీడేసింది)

మరిన్ని వార్తలు