ఇక రైళ్లలో ఇవి నిషేధం

21 Aug, 2019 18:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రైళ్లలో 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌ మెటీరియల్‌ వాడకాన్ని నిషేధించనున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు అక్టోబర్‌ 2 నుంచి నిషేధ ఉత్తర్వులను అమలుచేయాలని పలు రైల్వే విభాగాలను రైల్వే మంత్రిత్వ శాఖ బుధవారం ఆదేశించింది. దేశంలో అక్టోబర్‌ 2 నుంచి ఒకసారి వాడి పారవేసే ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిషేధించాలని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు అనుగుణంగా రైల్వేలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ప్లాస్టిక్‌ క్యారీబ్యాగుల వాడకాన్ని నిలిపివేయాలని రైల్వే సరఫరాదారులు, విక్రేతలను రైల్వే అధికారులు కోరనున్నారు. ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గిస్తూ తక్కువ ఖర్చుతో పర్యావరణ అనుకూలమైన తిరిగి వాడదగిన బ్యాగుల వినియోగాన్ని రైల్వేలు ప్రోత్సహించనున్నాయి. ఈ క్రమంలో ప్లాస్టిక్‌ మంచినీటి బాటిళ్లను తిప్పిపంపేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ బాటిళ్లను నిర్వీర్యం చేసేందుకు క్రషింగ్‌ యంత్రాలను తెప్పిస్తున్నారు. నిర్ణీత కాలవ్యవధిలో ప్లాస్టిక్‌ రహిత రైల్వేలను ఆవిష్కరించే లక్ష్యంతో రైల్వే మంత్రిత్వ శాఖ అడుగులువేస్తోంది.

మరిన్ని వార్తలు