గల్లంతైన నావికుల మృతి

28 Feb, 2014 01:01 IST|Sakshi
గల్లంతైన నావికుల మృతి

సింధురత్న జలాంతర్గామిలో ఇద్దరి మృతదేహాల లభ్యం
 
 సాక్షి, ముంబై: ఐఎన్‌ఎస్ సింధురత్న జలంతర్గామిలో జరిగిన అగ్ని ప్రమాదం ఇద్దరు నౌకాదళ అధికారులను బలితీసుకుంది. బుధవారం నాటి ప్రమాదం తర్వాత గల్లంతైన ఈ ఇద్దరు అధికారులు జలాంతర్గామిలోని ఓ కంపార్ట్‌మెంట్‌లో గురువారం విగతజీవులై కన్పించారు. వీరిని లెఫ్టినెంట్ కపిశ్ మున్వల్, లెఫ్టినెంట్ మనోరంజన్ కుమార్‌లుగా గుర్తించారు. సింధురత్న గురువారం ఉదయం హార్బర్‌కు చేరుకుంది. అందులో చిక్కుకున్న ఇద్దరు అధికారులను వైద్యాధికారుల బృందం పరీక్షించింది. ఆ తర్వాత వారిద్దరూ మరణించినట్టుగా నేవీ ఓ సంక్షిప్త సందేశంలో ప్రకటించింది. యుద్ధనౌకలు తరచూ ప్రమాదాల బారిన పడుతుండటం, తాజాగా సింధురత్న ఘటన చోటుచేసుకోవడంతో.. నైతిక బాధ్యత వహిస్తూ నేవీ చీఫ్ అడ్మిరల్ డి.కె.జోషి బుధవారం నాడే తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరానప్పటికీ.. నేవీ పశ్చిమ కార్యాలయూనికి (వెస్టర్న్ కమాండ్) చెందిన మరికొందరు అధికారులు కూడా రాజీనామాల యోచనలో ఉన్నట్టు తెలిసింది. వైస్ అడ్మిరల్ శేఖర్ సిన్హా రాజీనామాకు సిద్ధపడుతున్నట్టు సమాచారం. కాగా ఇటీవల చోటుచేసుకున్న ప్రమాదాలకు నైతిక బాధ్యత వహించేందుకే తాను కట్టుబడి ఉన్నట్టు అడ్మిరల్ జోషి తన సహోద్యోగులకు పంపిన ఓ అంతర్గత సందేశంలో స్పష్టం చేశారు.
 
 దర్యాప్తు బృందం ఏర్పాటు: మరోవైపు జలాంతర్గాములు (సింధురత్న సహా) ప్రమాదాలకు గురికావడంపై రియర్ అడ్మిరల్ స్థారుు అధికారి నేతృత్వంలో నేవీ ఓ ఉన్నతస్థారుు దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసింది. తక్షణమే విధులు ప్రారంభించిన ఈ బృందం ప్రమాదాలకు కారణాలను అన్వేషించి.. జలాంతర్గాముల సంబంధిత కార్యకలాపాలు సురక్షితంగా సాగేందుకు తగిన చర్యలను సిఫారసు చేయనున్నట్టు వెస్టర్న్ నావల్ కమాండ్ తెలిపింది.
 
 

>
మరిన్ని వార్తలు