కరోనా ఎఫెక్ట్స్‌: ఢిల్లీ చేరుకున్న 324 మంది భార‌తీయులు

1 Feb, 2020 09:35 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చైనాలోని వుహాన్‌ నుంచి ఎయిర్‌ ఇండియా ప్రత్యేక విమానంలో భారత్‌ విద్యార్థులు, ప్రొఫెసర్లు శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. ప్రాణాంతక వ్యాధి కరోనా వైరస్‌ వ్యాప్తిస్తున్న తరుణంలో వుహాన్‌ నుంచి భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానం బోయింగ్‌ 747 కేటాయించింది. భారత్‌కు చేరుకున్న వారిలో మొత్తం 324 మంది భారతీయులు ఉండగా అందులో 58 మంది తెలుగు ఇంజనీర్లు ఉన్నారు. వీరిలో 50 మంది ఏపీకి చెందిన వారు కాగా అయిదుగురు తెలంగాణకు చెందినవారు ఉన్నారు.  చైనా నుంచి వ‌చ్చిన భార‌తీయుల‌ను ప‌ర్య‌వేక్ష‌ణ‌లో పెట్టేందుకు ఢిల్లీ స‌మీపంలోని మ‌నేస‌ర్‌లో ప్ర‌త్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.  మరోవైపు ఆర్మీ క్యాంపులో ప్రత్యేక వైద్య పరీక్షల నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కరోనా లక్షణాలు ఉన్న వారిని రెండు వారాలపాటు పర్యవేక్షణలో పర్యవేక్షణలో ఉంచనున్నారు. పరీక్షల అనంతరం మిగతా వారిని వారి స్వస్థలాలకు పంపించనున్నారు. (కరోనాపై డబ్ల్యూహెచ్‌ఓ యుద్ధం)

ఈ ప్రక్రియకు సహకరించిన చైనా ప్రభుత్వానికి విదేశాంగమంత్రి ఎస్‌ జైశకంర్‌ ట్విటర్‌ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఇప్పటికే ఈ మహమ్మారి భారత్‌లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.  చైనాలోని వుహాన్‌ యూనివర్సిటీలో చదువుతున్న కేరళకు చెందిన విద్యార్థినికి ఈ వైరస్‌ సోకినట్లు గుర్తించారు.  ఆ యువతిని ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే తెలుగు రాష్ట్రాలలోను కరోనా వైరస్‌ అనుమానితులు రోజురోజుకీ పెరుగుతున్నారు.

చదవండి :చైనా నుంచి వచ్చే విద్యార్థుల కోసం.

ప్రధాని మోదీకి సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ

మరిన్ని వార్తలు