గిన్నిస్​ ఎక్కిన పులుల గణన

11 Jul, 2020 18:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత పులుల గణన–2018 గిన్నిస్​ రికార్డును సొంతం చేసుకుంది. ఈ సర్వే కోసం ఇండియా దేశవ్యాప్తంగా అడవుల్లో ట్రాప్​ కెమెరాలతో పెద్ద పులులను 76 వేల ఫొటోలు తీసింది. వీటితో పాటు అడవి పిల్లులు, చిరుతపులులకు చెందిన 51 వేల ఫొటోలు సంగ్రహించింది. ఫలితంగా 2018 భారత పులుల గణన ప్రపంచంలోనే అతిపెద్దదైన కెమెరా ట్రాపింగ్ వైల్డ్​ లైఫ్ సర్వేగా చరిత్ర సృష్టించింది. (కరోనా : చైనాపై మరో బాంబు)

ఈ మేరకు గిన్నిస్​ బుక్​ సంస్ధ, భారత ప్రభుత్వానికి గుర్తింపు సర్టిఫికేట్​ను అందజేసిందని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్​ జవదేకర్ ట్వీట్​ చేశారు. ఆత్మనిర్భార్​ భారత్​కు ఇదో ఉదాహరణ అని పేర్కొన్నారు. పులుల గణనలో ఇండియాలోని పులుల సంఖ్య 2,967గా తేలింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పులుల్లో 75 శాతానికి సమానం. (మారణహోమానికి పాక్​ కుట్ర)

పులుల ఫోటోలను తీయడానికి, అటవీ అధికారులు, వన్యప్రాణి సంరక్షణ నిపుణులు 141 స్టడీ సైట్లలో 26,838 ప్రాంతాల్లో కెమెరాలను అమర్చారు. ఆయా ప్రాంతాల్లో తీసిన 3.48 కోట్ల ఫోటోలను పరిశీలించిన తర్వాత పులుల సంఖ్యపై నిర్ధారణకు వచ్చారు. వీటిలో పులుల ఫొటోలు 76,651 కాగా 51,777 ఫొటోలు చిరుతలవి. మిగతా ఫొటోలు దేశంలోని అరుదైన వ్యన్యప్రాణులకు చెందినవి.

భారత్ ప్రపంచంలోని అడవి పిల్లులకు అతిపెద్ద, అత్యంత సురక్షితమైన ఆవాసాలలో ఒకటిగా నిలిచింది. 2014లో 2,226గా ఉన్న పులుల సంఖ్య 2018కి 2,967కి చేరింది. కేంద్ర పర్యావరణ శాఖ కింద పనిచేసే వైల్డ్‌ లైఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, జాతీయ పులుల సంరక్షణ సంస్థ కలిసి సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. నివేదికలో వెల్లడించిన అంశాల ప్రకారం 2006లో దేశంలో 1,411 పులులు మాత్రమే ఉండగా, వాటి సంఖ్య 2014కు 2,226కు, 2018కి 2,967కు పెరిగింది. పులి పిల్లలను లెక్కలోకి తీసుకోకుండా కేవలం ఎదిగిన పులులను మాత్రమే లెక్కించారు.

మరిన్ని వార్తలు